న్యూ దిల్లీ, జులై 24 : మణిపూర్ ఉదంతంపై సోమావారం కూడా పార్లమెంట్ ఉభయసభలు అట్టుడికిపోయాయి. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మణిపూర్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి. పార్లమెంటులో విపక్షాల నిరసనతో గందరగోళం నెలకొనడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఈ నెల 20న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయినప్పటి నుంచి మణిపూర్ ఉదంతంపై ఉభయ సభలు అట్టుడుకుతున్నాయి. పూర్తిస్థాయి చర్చ జరగాల్సిందేనని, సభలో మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్, ఆర్జేడీ, ఎంఐఎం, వామపక్షాలు, బీఆర్ఎస్ తదితర ప్రతిపక్షాలు గళమెత్తాయి. ప్రధాని సమక్షంలోనే చర్చ జరగాలని డిమాండ్ చేశాయి. మరోవైపు, పార్లమెంట్ ఆవరణలో కూడా అధికార, విపక్ష పార్టీల సభ్యులు పోటాపోటీగా ఆందోళనలు చేశారు. పార్లమెంట్ గాంధీ విగ్రహం ఎదుట బీజేపీ ఎంపీలు ఆందోళన చేశారు. బెంగాల్ హింస, రాజస్థాన్లో మహిళలపై నేరాలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై పార్లమెంట్లో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. సభను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని బీజేపీ ఆరోపించింది.
ఆప్ రాజ్యసభ సభ్యుడి సస్పెన్షన్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ‘మణిపుర్ అల్లర్ల’ అంశం కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్పై వేటు పడింది. సోమవారం ఉదయం 11 గంటలకు రాజ్యసభ సమావేశం కాగానే ప్రతిపక్ష సభ్యులు మణిపుర్ అంశాన్ని లేవనెత్తారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే సభ వాయిదా పడింది. అనంతరం 12 గంటలకు రాజ్యసభ తిరిగి ప్రారంభమవ్వగా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. మణిపుర్ అంశంపై ప్రధాని మోదీ సభకు వొచ్చి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు నినాదాలు చేశాయి. సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగించొద్దని ఛైర్మన్ హెచ్చరించినా వారు వినిపించుకోలేదు. ఈ క్రమంలోనే ఆప్ ఎంపీ సంజయ్ కుమార్ అనుచిత ప్రవర్తనకు పాల్పడుతున్నారని ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ హెచ్చరించారు. అనంతరం సంజయ్ కుమార్ను సస్పెండ్ చేయాలని రాజ్యసభ పక్ష నేత పీయూష్ గోయల్ తీర్మానం ప్రవేశపెట్టారు. విపక్షాల ఆందోళనల నడుమే ఈ తీర్మానంపై మూజువాణీ వోటింగ్ చేపట్టిన ఛైర్మన్.. ఆప్ ఎంపీని ఈ వర్షాకాల సమావేశాల మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.



