ఇంఫాల్, జూలై 21 : మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అమానవీయ ఘటనలో ప్రధాన నిందితులలో ఒకరి ఇంటిని కొందరు మహిళలు శుక్రవారం తగలబెట్టారు. చేతిలో కర్రలు ధరించిన కొందరు మహిళలు ఒక ఇంటికి నిప్పు పెడుతున్న దృశ్యాలతో కూడిన వీడియోను వార్తాసంస్థ ట్విట్టర్లో పోస్టు చేసింది. మణిపూర్కు చెందిన కంగ్పోక్పీ జిల్లాలో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించి గురువారం ఒక వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు మరో ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
గిరిజన మహిళల నగ్న ఊరేగింపునకు సంబంధించి బుధవారం రాత్రి బయటకు వచ్చిన వీడియోలు దేశవ్యాప్తంగా అలజడి సృష్టించాయి. సుప్రీంకోర్టు కూడా ఈ ఘటనపై సుమోటోగా విచారణ చేపట్టడంతోపాటు మణిపూర్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఈ ఘటనపై తీసుకున్న చర్యలకు సంబంధించిన సమగ్ర నివేదిక కోసం ఆదేశించింది. మణిపూర్ హింసాకాండపై ఈ వర్షాకాలం పార్లమెంట్ సమావేశాలలోనే చర్చించాలని, ప్రభుత్వం ఒక సమగ్ర ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనకు సంబంధించిన వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల ద్వారా బయటపడింది.
దీనిపై సుప్రీంకోర్టు స్వీయ విచారణ జరుపుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ చెప్పారు. మే 18న పోలీసులకు ఫిర్యాదు అందిందని, దీనిపై జూన్ 21న ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు. ఈ దారుణానికి పాల్పడినవారికి మరణ శిక్ష విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు హుయిరెమ్ హెరోడస్ ఇంటిని దుండగులు గురువారం తగులబెట్టారు. పెద్ద ఎత్తున మహిళలు, పురుషులు గుంపుగా వచ్చి, ఈ ఇంటిని తగులబెట్టారు.



