తాండూరు, ప్రజాతంత్ర, జులై 23 : భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాండూరు రూరల్ సీఐ రాంబాబు సూచించారు. భారీ వర్షాలతో ఉప్పొంగుతున్న వాగులు, చెరువులు, వంకల వద్దకు వెళ్లే ప్రయత్నం చేయోద్దని అన్నారు. ఈ సందర్భంగా సిఐ రాంబాబు మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం సంగెంకలాన్ లో వాగుదాటే ప్రయత్నం చేసి గల్లంతైన పెంటప్ప మృతి సంఘటన దురదృష్టకరమన్నారు. రాబోవు రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల సమీపంలోని చెరువులు, వాగుల వద్ద వెళ్లరాదని, పిల్లలు, యువకులు వెళ్లకుండా ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. అదేవిధంగా విద్యుత్ స్థంబాల వద్దకు వెళ్లరాదని, ఇంట్లో ఎలక్ట్రిక్ వస్తువుల నుంచి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఏలాంటి అత్యవసరమైన పరిస్థితులు ఏర్పడితే పోలీసులను సంప్రదించాలని సూచించారు.


