సబ్ వేరియంట్ బిఎ.2.75గా గుర్తించిన డబ్ల్యూహెచ్వో
న్యూ దిల్లీ, జూలై 7 : భారత్లో కొరోనా కొత్త వేరియంట్ బయటపడింది. ఒమిక్రాన్ వేరియంట్ కొత్త సబ్ వేరియంట్ బిఎ.2.75 ఇండియాలో కనుగొన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే ఈ వైరస్ లక్షణాలను పరిశీలిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. యూరప్, అమెరికాలో, బిఎ4, బిఎ.5 వేరియంట్ల వల్ల రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయని జనరల్ టెడ్రోస్ ప్రకటించారు. గత రెండు వారాలుగా ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసులు 30 శాతం మేర పెరిగాయని టెడ్రోస్ తెలిపారు.
డబ్ల్యూహెచ్వోకు చెందిన ఆరు సబ్ రీజియన్లలో నాలుగు చోట్ల కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు. ఒమిక్రాన్ సబ్ వేరియింట్ బిఎం.2.75 వైరస్ పై చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశారు. ఈ ఉప-వేరియంట్ మొదటగా భారత్లో గుర్తించామని తెలిపారు. భారత్తో పాటు.. మరో 10 దేశాల్లోనూ వైరస్ గుర్తించినట్లు వెల్లడించారు. ఈ సబ్ వేరియంట్ స్పైక్ ప్రోటీన్ రిసెప్టర్ -బైండింగ్ డొమైన్పై కొన్ని ఉత్పరివర్తనాలను కలిగి ఉన్నట్లు అనిపిస్తుందని చెప్పారు.
అయితే వైరస్ వల్ల రోగనిరోధక శక్తికి ఏ మేరకు ఇబ్బంది కలిగిస్తుంది…మనిషిపై ఏ మేరకు ప్రభావం ఉంటుందో తెలుసుకోవడానికి మరింత సమయం పట్టవచ్చని తెలిపారు. వైరస్ను డబ్ల్యూహెచ్వో నిత్యం ట్రాక్ చేస్తోందని…సాంకేతిక సలహా బృందం నిరంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటాను చూస్తోందన్నారు.




