భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి..కలెక్టర్ ప్రియాంకా ఆలా సమీక్ష

గోదారి వరద పై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ ప్రియాంక అలా – . సిబ్బంది కార్య స్థానంలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశం

భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 20 : భద్రాచలం వద్ద గోదావరి వరద ఉదృతి వేగంగా పెరుగుతున్న నేపధ్యంలో జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అలా ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. సిబ్బంది కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలని అదేశించారు. 24 గంటలు పనిచేయు విదంగా కలెక్టరేట్ తో పాటు కొత్తగూడెం, భద్రాచలం ఆర్డిఓ కార్యాలయాలు అలాగే చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. భద్రాచలం వద్ద వరద ఈ రోజు సాయంత్రం వరకు మొదటి ప్రమాద హెచ్చరిక వరకు చేరే అవకాశం ఉన్నదని యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఏ ఒక్క ప్రాణానికి హాని కలుగ కుండా ప్రజలకు కానీ పశువులకు కానీ చేపట్టాల్సిన రక్షణ చర్యలపై ఎప్పటి కపుడు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.

గురువారం ఉదయం 8 గంటలకు 39.50 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి. 781614 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుండి వచ్చే వరదలతో క్రమేపీ గోదావరి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. నీళ్లు చేరే వరకు ప్రజలు వేచి ఉండొద్దని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయొద్దని, ప్రజలు ఇంటి నుంచి బయటికి రావొద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని చెప్పారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దన్నారు. పశువులను మేతకు వదల కుండా ఇంటి పట్టునే ఉంచాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్ళు గుర్తించి వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. మంచినీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రసవ సమయం దగ్గరగా ఉన్న గర్భిణీలను హాస్పిటల్స్ కు తరలించాలన్నారు. అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. భద్రాచలంలో స్నానఘాట్లు వద్ద భక్తులు దిగకుండా నియంత్రణ చేయాలని, నియంత్రణకు గస్తీ పెంచాలని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలన్నా రు. పునరావాస కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని చెప్పారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరాయంగా చేపట్టాలన్నారు. భాదితులకు నాణ్యమైన, పరిశుబ్రమైన ఆహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *