- కేసీఆర్ మహారాష్ట్రలో డ్రామా చేస్తున్నారు
- మహా రాజకీయాలపై కేసీఆర్ ప్రభావం ఏ మాత్రం ఉండబోదు
- శివసేన నేత ఎంపీ సంజయ్ రౌత్
ముంబై, జూన్ 27 : కేసీఆర్ ప్రసంగంపై శివసేన(యూబీటీ) నేత ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. కేసీఆర్ మహారాష్ట్రలోకి వచ్చి డ్రామా చేస్తున్నారని.. ఇలానే నాటకాలాడితే తెలంగాణలో కూడా అధికారం కోల్పోవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయంపై మరింత మాట్లాడిన సంజయ్ రౌత్… మహారాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ ప్రభావం ఏ మాత్రం ఉండబోదని అన్నారు. ఇదే క్రమంలో… ఇప్పటికే తెలంగాణలో బీఆరెస్స్ పార్టీ ప్రభావం తగ్గిపోతోంది అని చెప్పిన రౌత్… కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటిస్తున్న రోజు అనేకమంది బీఆరెస్స్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారని ఎద్దేవా చేశారు. ఇదే ఫ్లోలో… బీఆరెస్స్ పార్టీ అంటే బీజేపీకి బీ టీఅం అని అభిప్రాయపడిన ఆయన… బీజేపీనే కేసీఆర్ ను మహారాష్ట్రకు పంపినట్లు అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. కాగా… రెండు రోజులుగా సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.
దాదాపు 600 వాహనాల కాన్వాయ్ తో హైదరాబాద్ నుంచి సోమవారం సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా… పండరీపురంలోని శ్రీ విఠల్ రుక్మిణి దేవస్థానాన్ని కేసీఆర్ ఇతర ప్రజాప్రతినిధులు సందర్శించారు. అక్కడ విఠలేశ్వరుడి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టీఆరెస్స్ కాస్త బీఆరెస్స్ గా మారిన అనంతరం జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ బలంగా భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… ఇతర రాష్ట్రాలపై కేసీఆర్ దృష్టి సారించారు. ముఖ్యంగా మహారాష్ట్రలో బీఆరెస్స్ పార్టీని విస్తరించేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా సోలాపుర్ జిల్లా సర్కోలీలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తరచూ మహారాష్ట్రలో పర్యటిస్తూ అక్కడ బహిరంగ సభల్లో పాల్గొంటూ స్థానిక ప్రజలపై హామీ వర్షం కురిపిస్తున్న కేసీఆర్… పనిలోపనిగా అక్కడి అధికార విపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇందులో భాగంగా… తాజాగా సర్కోలీ సభలో మైకందుకున్న ఆయన… మహారాష్ట్రను అభివృద్ధి చేసే విషయంలో కాంగ్రెస్ శివసేన బీజేపీలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు! ఇదే సమయంలో దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచిపోయినా… అభివృద్ధి విషయంలో ఇంకా ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని సూచించారు. ఇక దేశాన్ని దాదాపు 50 ఏళ్లు కాంగ్రెస్ పాలించిందని గుర్తుచేసిన ఆయన… తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమైనపుడు మహారాష్ట్రలో ఎందుకు కాదని ప్రశ్నించారు. ఇదే క్రమంలో… రాష్ట్రం ఏర్పడిన అతి తక్కువ సమయంలోనే తెలంగాణ అభివృద్ధి సాధించిందని.. బీఆరెస్స్ నిత్యం రైతుల పక్షాన మాత్రమే నిలుస్తుందని కేసీఆర్ తెలిపారు. అదేవిధంగా… తమపై వస్తోన్న రాజకీయ విమర్శలపైనా కేసీఆర్ స్పందించారు. బీజేపీకి బీఆరెస్స్ బీ టీమ్ అని వస్తోన్న విమర్శలను ఖండించారు. ఇదే ఫ్లోలో… బీఆరెస్స్ విషయంలో అన్ని పార్టీలూ ఆందోళన చెందుతున్నాయని చెప్పుకొచ్చారు.


