కేంద్ర ఏజెన్సీల చర్యలతో నేరుగా ముడిపడిన వైనం
ఇండియా కూటమి చెక్కుచెదర లేదు.. లోక్సభ ఎన్నికల్లో 272 మార్క్ను దాటుతుంది
కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్
బీజేపీకి అనుకూలంగా పలు కంపెనీలు కొనుగోలు చేసిన రూ.4,000 కోట్ల విలువైన బాండ్లతో వారికి కాంట్రాక్టుల కేటాయింపుతో ప్రత్యక్షంగా లింక్ ఉందని, వాటిపై కేంద్ర ఏజెన్సీలు ప్రారంభించిన చర్యలతో నేరుగా ముడిపడి ఉన్నాయని, అందుకు తమ దగ్గర ఆధారాలున్నాని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ అన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ మమతా బెనర్జీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ భారత కూటమి చెక్కుచెదరకుండా ఉందని అన్నారు. ఇక అవినీతి అనే అస్త్రంతో ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ గేమ్ ప్లాన్ తలకిందులైందని అన్నారు. ఆదివారం పిటిఐ ప్రధాన కార్యాలయంలో సంపాదకులతో జరిగిన ఇంటరాక్షన్లో జైరామ్ రమేష్ మాట్లాడుతూ..ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యంగా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో 272 మార్కును అధిగమించి బిజెపిని అధికారం నుండి తరిమివేస్తాయని అన్నారు. ఎలక్టోరల్ బాండ్లపై మాట్లాడుతూ…రూ.4,000 కోట్ల బాండ్లు నేరుగా రూ.4 లక్షల కోట్ల కాంట్రాక్టులతో ముడిపడి ఉన్నాయని, ఎలక్టోరల్ బాండ్లకు, కాంట్రాక్టుల కేటాయింపుకు మధ్య స్పష్టమైన సంబంధం ఉందని జైరామ్ రమేష్ అన్నారు. ఒక బిజెపి ఎంపి మౌలిక సదుపాయాల కాంట్రాక్టులు పొందిన తర్వాత ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసారని పేర్కొన్నారు. బీజేపీకి అనుకూలంగా పలు కంపెనీలు కొనుగోలు చేసిన రూ.4,000 కోట్ల విలువైన బాండ్లు, కాంట్రాక్టుల కేటాయింపు, వాటిపై కేంద్ర ఏజెన్సీలు ప్రారంభించిన చర్యలతో నేరుగా ముడిపడి ఉన్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, ఇది పూర్తిగా క్విడ్ ప్రోకో కేసని ఆయన స్పష్టం చేశారు. హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్లపై చర్యలను అవినీతిపై పోరాటమని మోదీ చెప్పడం పూర్తిగా బూటకపు వాదన అన్నారు. మోదీకి సంబంధించినంతవరకు అవినీతి ఒక ‘ఖోఖ్లా(డొల్ల) ప్లాంక్’ అని చూపించడానికి అనేక ఆధారాలు ఉన్నాయని అన్నారు. ప్రతిపక్షాల ఐక్యతపై మాట్లాడుతూ… డిసెంబర్ 19 వరకు మొత్తం 28 పార్టీలు కలిసి ఉన్నాయని, కానీ నితీష్ కుమార్, మమతా బెనర్జీలు ఇద్దరు మాత్రమే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. కేవలం నితీష్ కుమార్ ఇండియా కూటమిలో భాగం కాదంటే కూటమి మొత్తం విచ్ఛిన్నమైందనే అర్థం కాదని రమేష్ అన్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఖచ్చితంగా మెజారిటీ మార్కును దాటుతుందని జైరామ్ రమేష్ నొక్కి చెప్పారు. ఇండియా బ్లాక్ బుడగ పగిలిందా అని అడిగినప్పుడు, ఎన్సిపి, శివసేన, డిఎంకె, జెఎంఎంలతో పొత్తు మాదిరిగానే ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు చెక్కుచెదరలేదని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో సీపీఎం, సీపీఐలతో తమ పొత్తు ఖరారు కానుందని, అస్సాంలో తమకు 11 పార్టీల కూటమి ఉందని, సమాజ్ వాదీ పార్టీతో పొత్తు ఉందని వివరించారు. తాను ఇండియా బ్లాక్లో భాగమని మమతా బెనర్జీ కూడా చెప్పారని, కానీ ఆమె తమతో సీట్ షేరింగ్ కాదని ఆయన తెలిపారు. కేజ్రీవాల్ అరెస్ట్ ప్రతిపక్షాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దానిపై స్పందిస్తూ…ముఖ్యంగా దిల్లీ సీఎం, హేమంత్ సోరెన్ల కేసులను ప్రధాని అవినీతిపై పోరాటంగా చిత్రీకరిస్తున్నారని, కానీ ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూను పరిశీలిస్తే…చందా దో, దండా లో…అనేది స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. 30 కంపెనీలకు వ్యతిరేకంగా ఇడి, సిబిఐలను ఉపయోగించారని, ఈ 30 కంపెనీల ద్వారా బిజెపికి 330 కోట్ల రూపాయల విలువైన విరాళాలు వొచ్చాయని, ఆ విషయాన్ని తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ పార్టీకి నమ్మకమైన సైనికుడినని చెప్పారని ఆయన గుర్తు చేశారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీనియర్ కాంగ్రెస్ నేతలు విముఖంగా ఉన్నారనే ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చారు. లోక్సభ ఎన్నికల్లో సీనియర్ నేతలు ఎవరూ పోటీ చేయకుండా తప్పించుకోవడం లేదని, పోటీ చేయమని అడిగితే పోటీ చేయని నాయకుడు ఎవరూ లేరని తాను అనుకోనన్నారు. రాహుల్ గాంధీది భిన్నమైన రాజకీయమని, ఉద్యమ రాజకీయమని, అతను కాంగ్రెస్ పునరుద్ధరించాలని కోరుకుంటున్నాడని జైరామ్ రమేష్ అన్నారు. కాంగ్రెస్లో కొత్త శక్తిని నింపడంలో రాహుల్ అసాధారణ విజయం సాధించారని అన్నారు. ఆయన నేతృత్వంలోని భారత్ జోడో యాత్రల తర్వాత అందరూ ఆయనను భిన్నంగా చూడవలసి వొచ్చిందన్నారు.


