సిఎం కేసీఆర్ వొచ్చాకే గజ్వేల్ ప్రజల బతుకు దెరువు మారింది
విజయరామారావు, గీతారెడ్డి, నర్సారెడ్డి చేసిందేమీ లేదు
తునికి ఖల్సాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గృహా ప్రవేశాల్లో మంత్రి హరీష్రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి చెందిన నేతలకు మాటలెక్కువ, చేతలు తక్కువ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు మరోసారి తనదైన శైలిలో బిజెపిపై ఫైర్ అయ్యారు. దేశంలో ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు లేవనీ, డబుల్ ఇంజన్ గవర్నమెంటు బిజెపిపై మంత్రి హరీష్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలంలోని తునికి ఖల్సాలో రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీతో కలిసి లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ గృహా ప్రవేశాలు చేయించిన అనంతరం మంత్రి హరీష్రావు మాట్లాడుతూ… బతుకమ్మ పండుగ రోజున డబుల్ బెడ్ రూమ్ గృహా ప్రవేశాలు చేయించడం సంతోషంగా ఉందనీ, సద్దితిన్న రేవు తలిస్తే.. దేవుడు సల్లగా చూస్తాడని మంత్రి హరీష్రావు అన్నారు. గతంలో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన విజయరామారావు, గీతారెడ్డి, నర్సారెడ్డి ప్రజలకు చేసింది శూన్యమనీ, ప్రజల బతుకుదెరువు మారలేదన్నారు. అయితే, కేసీఆర్ గజ్వేల్కు వొచ్చాకే గజ్వేల్ ప్రజల బతుకు దెరువు పూర్తిగా మారిదన్నారు.
డబుల్ ఇంజన్ గవర్నమెంట్ పాలిత ప్రాంతాల్లోని పింఛన్లను తెలంగాణ రాష్ట్రంలోని పింఛన్లకు, అలాగే కరెంటు కూడా సరిగ్గా లేక గోస పడుతున్నట్లు.. ఇలా ఎన్నోరకాలుగా చాలా వత్యాసం ఉందన్నారు. గత కాంగ్రెస్ హయాంలో బేస్మెంట్కు డబ్బులు సరిపోయేవీ కావనీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు కట్టి, గడప పెట్టి, ఇళ్లు తాళం చెవి మీ చేతిలో పెట్టి కొత్తింట్లోకి తోలుతున్నామని మంత్రి హరీష్రావు చెప్పారు. 70 ఏండ్లలో కాని పనిని, సిఎం కేసీఆర్ నేతృత్వంలో ఎనిమిదేళ్లలో ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. టిడిపి హయాంలో రూ.70, కాంగ్రెస్ హయాంలో రూ.200 ఇచ్చారనీ, కానీ ఇవాళ సిఎం కేసీఆర్ వొచ్చాక దేశంలో ఎక్కడా లేని విధంగా ఆసరా పింఛన్లు 2016 రూపాయలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతీ మండలానికి ఎస్సీ వెల్ఫేర్, మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు కేసీఆర్ సర్కారు తెచ్చిందన్నారు. రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ…టిఆర్ఎస్ పార్టీ పేద ప్రజల పార్టీ అని టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని హిందు-ముస్లింలే కాకుండా ప్రతీ కులం, మతం వాళ్లు సంతోషంగా ఉన్నారన్నారు.
దేశంలోని 29 రాష్ట్రాలలో గుజరాత్ ఫె•యిల్ రాష్ట్రమైతే అన్నింటా ఆదర్శ రాష్ట్రం తెలంగాణ అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని పనిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అందరూ సంతోషంగా ఉన్నారనీ, అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరిగాయన్నారు. ఇంటింటా మిషన్ భగీరథ నీళ్లు, అర్హులందరికీ ఆసరా ఫించన్లు సిఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అందిస్తున్నామనీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలపై సిఎం కేసీఆర్ నియత్ ఉంది కాబట్టే రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవరెడ్డి, ఎఫ్డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్రెడ్డి, డిసిసిబి ఛైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



