ఫ్లోరైడ్‌ ‌బాధితుల పక్షాన పోరాడిన అంశుల స్వామి మృతి

నల్లగొండ, ప్రజాతంత్ర, జనవరి 28 : ప్లోరోసిస్‌ ‌బాధితుడు, పోరాటయోధుడు అంశుల స్వామి మృతిచెందారు. 32 ఏండ్ల స్వామి..ప్రమాదవశాత్తు బైక్‌పైనుంచి పడి చనిపోయారు. నల్లగొండ జిల్లా శివన్నగూడెం గ్రామానికి చెందిన స్వామి చిన్నతనంలోనే ప్లోరోసిస్‌ ‌బారినపడ్డారు. ప్లోరైడ్‌ ‌రక్కసిని తరమికొట్టాలని అవిశ్రాంతంగా పోరాడారు. ప్లోరైడ్‌ ‌బాధితుల తరపున గళం వినిపించారు. శుక్రవారం సాయంత్రం తన ఇంటివద్ద ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి స్వామి కిందపడిపోయారు. దీంతో మెడకు గాయమవడంతో స్థానికంగానే చికిత్స చేయించుకున్నారు.

అయితే పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ప్లోరోసిస్‌ ‌బాధితుడు స్వామి మృతిపట్ల సీఎం కేసీఆర్‌ ‌సంతాపం వ్యక్తం చేశారు. ప్లోరోసిస్‌ ‌సమస్య అనగానే స్వామి పేరు గుర్తుకొస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో స్వామి పోరాటం ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందని వెల్లడించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంశుల స్వామి మృతిపట్ల మంత్రి కేటీఆర్‌ ‌ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. బాధితుడైన స్వామి ఫ్లోరైడ్‌ ‌సమస్యపై అవిశ్రాంతంగా పోరాడారు. ఆయన ఎంతో మందికి స్ఫూర్తి. ఎప్పటికీ తన మనసులో గుర్తుండిపోతాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ట్వీట్‌ ‌చేశారు. అంశాల స్వామి మృతికి మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి కూడా సంతాపం ప్రకటించారు. ఆయన పోరాటం మరువలేనిదన్నారు. ఈ కారణంగానే కెసిఆర్‌ ‌నల్లగొండలో ఫ్లోరైడ్‌ ‌నిర్మూలనకు చర్యలు తీసుకున్నారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *