- కేసును సిబిఐ విచారణకు అప్పగిస్తూ హైకోర్టు తీర్పు
- సిట్ విచారణ నిలిపివేత..రికార్డులు సిబిఐకి అప్పగించాలని ఆదేశం
- చంచల్గూడ జైలులో నందకుమార్పై ఇడి విచారణ
హైదరాబాద్, డిసెంబర్ 26(ఆర్ఎన్ఎ) : ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఫామ్ హౌస్ కేసులో కేసీఆర్ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసును సీబీఐకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్..సిట్ను రద్దు చేసిన న్యాయస్థానం తక్షణమే దాన్ని సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. సిట్ వద్ద ఉన్న వివరాలు, ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తునకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని సీబీఐకు ఇవ్వాలని చెప్పింది. అలాగే సిట్ దర్యాప్తు కూడా నిలిచిపోనుంది. ఫామ్ హౌస్ కేసులో సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని నిందితులు హైకోర్టును ఆశ్రయించారు.
సీబీఐ లేదా ఇండిపెండెంట్ దర్యాప్తు సంస్థ ద్వారా ఎంక్వైరీ చేయాలని అభ్యర్థించింది. దర్యాప్తు వివరాల లీకులపై పిటిషనర్లు మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సీఎం కేసీఆర్ సైతం ఆధారాలను లీక్ చేసిన విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. పిటిషనర్ల తరఫున మహేశ్ జఠ్మలానీ, సిట్ తరఫున సుప్రీమ్ కోర్టు సీనియర్ అడ్వొకేట్ దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం పిటిషనర్ల వాదనలతో ఏకీభవించింది. సిట్ను క్వాష్ చేయడంతో పాటు కేసును సీబీఐకి అప్పగించాలంటూ తీర్పు వెలువరించింది. మరోవైపు ఫామ్ హౌస్ కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ ఈడీ విచారణ కొనసాగుతుంది. ఈడీ అధికారులు చంచల్ గూడ జైలులోనే ఆయన స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నారు.
లంచ్కు ముందు వరకు నందకుమార్ వ్యక్తిగత వివరాలను మాత్రమే రికార్డు చేశారు. ఆయన వ్యాపారాలు, పరిచయాలపై ఆరా తీశారు. నందకుమార్ పార్ట్నర్గా ఉన్న రోహిత్ రెడ్డి కుటుంబసభ్యులకు సంబంధించిన వివరాలను సైతం ఈడీ రికార్డు చేసింది. అభిషేక్ ఆవుల ద్వారా పరిచయమైన వ్యక్తుల వివరాలు, ఆర్థిక వ్యవహారాలపైనా అధికారులు సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. జైలర్ రూమ్లో నందు స్టేట్ మెంట్ను అధికారులు రికార్డు చేసారు. లంచ్కు ముందు గంటసేపు ప్రశ్నించిన ఈడీ..45 నిమిషాల భోజన విరామం అనంతరం మళ్లీ విచారణ ప్రారంభించారు. సాయంత్రం ఐదింటి వరకు ఈడీ విచారణ కొనసాగింది. కొరోనా కేసులు పెరుగుతున్నందున నంద కుమార్ను ఈడీ అధికారులు చంచల్ గూడ జైలులోనే ప్రశ్నిస్తున్నారు.




