- సేంద్రీయ వ్యవసాయంపై వివరాలు అడిగి తెలుసుకున్న అమిత్ షా
- త్వరలోనే ఆర్గానిక్ ఉత్పత్తుల మార్కెటింగ్ కు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ
హైదరాబాద్,ప్రజాతంత్ర, ఆగస్ట్ 21: రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకం అమలు కాకపో వడంవల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలువురు ఆదర్శ రైతులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎదుట వాపోయారు. ఆదివారం బేగంపేటలో అమిత్ షా ఆదర్శ రైతులతో సమావేశమయ్యారు. వివిధ జిల్లాలకు చెందిన 17 మంది ఆదర్శ రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇంఛార్జీ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, మరికొందరు కిసాన్ నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో సేంద్రీయ వ్యవసాయంవల్ల కలిగే ప్రయోజనాలతోపాటు ఫసల్ బీమా అమలు పథకంపైనా చర్చించారు. దాదాపు 30 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో పలువురు రైతులు మాట్లాడుతూ తెలంగాణలో ఫసల్ బీమా యోజనను అమలు చేయడం లేదని అమిత్ షా ద్రుష్టికి తెచ్చారు. ఆకాల వర్షాలతో పంట నష్టం వాటిల్లుతున్నా తమకు పరిహారం అందకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారని పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది .తెల్కపల్లి మండలానికి చెందిన లావణ్య అనే మహిళా రైతు మాట్లాడుతూ తనకు గతంలో 10 ఎకరాల భూమి ఉండగా.. వ్యవసాయంవల్ల తీవ్రంగా నష్టాలు వచ్చాయన్నారు.
దీంతో కొంత భూమిని అమ్మేసి సేంద్రీయ వ్యవసాయం ఆరంభించానన్నారు. సేంద్రీయ వ్యవసాయంతో లాభాలు ఆర్జిస్తున్నానని తెలిపారు. ముఖ్యంగా కొరోనా సమయంలో పెద్ద ఎత్తున ప్రజలు తన వద్దకు వచ్చి సేంద్రీయ ఉత్పత్తులను కొనుగోలు చేసి తీసుకెళ్లారని చెప్పారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయంతో ఎంతో మేలు జరుగుతుందన్నారు. తాను కూడా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నట్లు తెలిపారు. గతంలో తనకున్న 20 ఎకరాల్లో తెలీకుండా రసాయన ఎరువులు వాడటంతో పంట దెబ్బతిన్నదని గుర్తు చేసుకున్నారు. తనవద్ద దగ్గర మేలు జాతి (ఇక్కీస్) గోవులున్నాయని, అందులో ఒకటి ఒక గోమాత 12వ జనరేషన్ కు చెందినదని తెలిపారు. ఆ గోమాతకు మహాలక్ష్మీగా నామకరణం చేసి మనవుడికి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నానని అమిత్ షా వివరించారు. గోమాత పేడను సేంద్రీయ ఎరువులుగా వాడటంవల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆర్గానిక్ ఉత్పత్తుల మార్కెటింగ్ విషయంలో వెనుకబడి ఉన్నామంటూ కొందరు రైతులు అమిత్ షా ద్రుష్టికి తీసుకురాగా… అతి త్వరలోనూ అమూల్ సంస్థ ద్వారా సేంద్రీయ ఉత్పత్తులను సేకరించేందుకు హైదరాబాద్ లో తగిన ఏర్పాటు చేస్తామన్నారు.
అందులో భాగంగా హైదరాబాద్ లో 5 సేంద్రీయ వ్యవసాయ లాబోరేటరీలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సేంద్రీయ ఉత్పత్తులపై పరీక్షలు చేయడంతోపాటు సేంద్రీయ ఉత్పత్తులు పండించే భూముల్లో ఏటా రెండుసార్లు భూసార పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. సమావేశానంతరం కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, కొండపల్లి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ…. ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకం దేశమంతా అమలవుతున్నప్పటికీ తెలంగాణలో అమలు చేయకపోవడంపై అభ్యుదయ రైతులు అమిత్ షాకు వివరించినట్లు తెలిపారు. ఎన్నో ప్రాంతాలకు చెందిన రైతులు ఈ భేటీలో పాల్గొన్నారని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్న తీరుపైనా అమిత్ షాకు రైతులు వివరించారు. భూసార పరీక్షలు చేయమని కేంద్రం నిధులిస్తే అలాంటివేమీ చేపట్టడం లేదని చెప్పారు. కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం మరిన్ని మెరుగైన పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారన్నారు. వికారాబాద్ రైతు మాణిక్ రెడ్డి మాట్లాడుతూ… రెండేళ్లు గా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
పంటలు మునిగిపోయాయి. ఈ విషయాన్ని షా దృష్టికి తీసుకెళ్లాం. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందడంలేదని అమిత్ షాకు వివరించాం. ఫసల్ బీమా అమలు చేయాలని కోరాం. ఈ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించి అందేలా చూడాలని విజ్ఞప్తి చేశాం. అమిత్ షా సైతం తనుకున్న పొలంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నట్లు చెప్పారని రైతు సంఘం నేతలు వివరించారని తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని అమిత్ షా సూచించినట్లు పేర్కొన్నారు. విద్యుత్ మోటర్లకు మీటర్ల బిగిస్తున్నారంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను అమిత్ షా దృష్టికి తీసుకురాగా ‘‘ చట్టాలు కాదు.. ముందు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్చాలి’’అని బదులిచ్చినట్లు వెల్లడించారు.
ప్రతి కార్యకర్త ఇంట్ల నేనుంటా… ధైర్యంగా కొట్లాడండి..!
కార్యకర్త సత్యనారాయణకు భరోసా ఇచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
‘‘సార్… ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను దారుణంగా మోసం చేస్తుండు. దళితులకు ఇచ్చిన హామీలేవీ నెరవేర్చడం లేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడిస్తేనే తెలంగాణలో దళితులకు మేలు జరుగుతుంది‘’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎదుట బీజేపీ కార్యకర్త ఎన్.సత్యనారాయణ అన్నారు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని సాంబమూర్తి నగర్ లోని ఎన్.సత్యనారాయణ నివాసానికి చేరుకున్నారు. చిన్న ఇంట్లో అత్యంత సాధారణ జీవితాన్ని గడుపుతున్న సత్యనారాయణ కుటుంబ సభ్యులను కలిసిన అమిత్ షా వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమిత్ షాను చూడగానే సత్యనారాయణ కళ్లలో ఆనందభాష్పాలు రాలాయి. ‘’ సార్.. 30 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నా… మీ అంత గొప్ప నాయకుడు నాలాంటి సామాన్య కార్యకర్త ఇంటికి రావడం నా అద్రుష్టం.
నా జన్మధన్యమైంది. మరింత కష్టపడి పనిచేస్తా’’అని పేర్కొన్నారు.రాష్ట్రంలో సీఎం కేసీఆర్ 8 ఏండ్లుగా దళితులను దారుణంగా మోసం చేశారని సత్యనారాయణ వాపోయారు. ‘‘దళితుడికి సీఎం పదవి ఇస్తానన్న హామీని గాలికొదిలేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న హామీ అమలు కాలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో లబ్ది పొందాలని తెచ్చిన దళిత బంధు పథకాన్ని పూర్తిగా నీరుగార్చారు. కేసీఆర్ దురాగతాలపై పోరాటం చేసిన తనపై అక్రమంగా కేసులు నమోదు చేసి వేధించారు. సీఎం కేసీఆర్ పాలనను అంతమొందిస్తేనే దళితులకు న్యాయం జరుగుతుంది’’అని అభిప్రాయపడ్డారు. సత్యనారాయణ చెప్పిందంతా సానుకూలంగా విన్న అమిత్ షా… ‘‘ప్రతి కార్యకర్త ఇంట్ల నేనుంటా…మీరంతా ధైర్యంగా కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనపై కొట్లాడండి‘’’ అని భరోసా ఇచ్చారు.




