- కోస్గిలో 50 పడకల హాస్పిటల్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
- మంచినీటి కష్టాలు తీర్చిన నాయకుడు సిఎం కెసిఆర్ అన్న మంత్రి
కొడంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 4 : త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ విడుదల చేస్తారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో మహిళలకు శుభవార్త వినిపిస్తామని ఆయన పేర్కొన్నారు. బుధవారం కోస్గిలో 50 పడకల హాస్పిటల్ని మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసంగిస్తూ…మహిళల కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేశారని మంత్రి తెలిపారు. కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్, గృహలక్ష్మి ఇలా అనేక పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. త్వరలో బీఆర్ఎస్ మేనిఫెస్టో వొస్తుందని, మహిళలను మరింత బలోపేతం చేసే విధంగా ఉంటుందని తెలిపారు. మహిళను ఆర్థికంగా బలోపేతం చేసే అంశాలు మేనిఫెస్టోలో ఉంటాయని, త్వరలోనే శుభవార్త వింటారని మంత్రి స్పష్టం చేశారు. కోస్గి, కొడంగల్లో ఒకప్పుడు మంచి నీటి కష్టాలుండేవని, మూడొద్దులకు ఒకసారి నీళ్లు వొచ్చేవని హరీష్ రావు గుర్తు చేశారు.
ట్యాంకర్ల వెంట నీళ్ల కోసం పరుగెత్తేవారని, గతంలో బోరింగ్లు కొట్టి, నీల్లు మోసి ఇబ్బంది పడ్డారని, ఇప్పుడు ఇంటింటికీ నల్లా పెట్టి నీళ్లు అందిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. కొడంగల్ ఆడబిడ్డల కష్టాలు సీఎం కేసీఆర్ తీర్చారన్నారు. రేవంత్ రెడ్డి గెలిచి ఉంటే మరో 10 ఏండ్లు అయినా మంచినీళ్లు రాకపోయేవని అన్నారు. పక్కనే కర్ణాటక ఉందని, అక్కడ కల్యాణ లక్ష్మి ఉందా అని ప్రశ్నించారు. 12 లక్షల పెళ్లిళ్లకు రూ. 11 వేల కోట్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు అనేటోళ్లని, ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో పోదాం పదా బిడ్డ సర్కార్ దవాఖానాకు అనే అంత గొప్పగా హాస్పిటళ్లను అభివృద్ధి చేశామని, పైసా ఖర్చు లేకుండా కాన్పు చేసి కేసీఆర్ కిట్ అందిస్తున్నామని, కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ పని చేసిందా? అని హరీష్ రావు ప్రశ్నించారు.





