నిజానికి ఇందిరాగాంధీ పాలనకు చాలా ముందు నుంచే ఈ దేశంలో రూల్ ఆఫ్ లాను ఉల్లంఘించడం ప్రారంభమయింది.. ఆమె పాలనకన్నా ముందే బీహార్లో విచారణలో ఉన్న ఖైదీలు పదకొండు సంవత్సరాలపాటు జైళ్లలో మగ్గిపోయారు. దానికి ఇందిరాగాంధీ బాధ్యత ఏమీ లేదు. అంతకాలం విచారణ సాగుతున్నా ఖైదీలను విడిచిపెట్టలేదంటే దానికి బాధ్యత మన న్యాయస్థానాలు వహించాలి.
నాగభూషణం పట్నాయక్ పై చట్టబద్ధమైన జైలుకస్టడీ నుంచి తప్పించుకున్న నేరంపై విచారణ జరిపారు. ఆ న్యాయస్థానం ఆయన నిర్దోషి అని తీర్పు చెప్పింది. అంటే ఆయన తప్పించుకుపోయాడని ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయింది. అసలు ఆయన జైలు నుంచి పారిపోయాడనే నిరూపించలేకపోయినప్పుడు, ఆ తర్వాత రెండు హత్యలు చేశాడనే ఆరోపణకు అర్థం లేదు. అందువల్ల ఆ జంట హత్యల కేసులో ఛార్జిషీటు వేయడానికే వీలు కాలేదు. ఆ కేసు విచారణ జరగలేదు. సరే, పార్వతీపురం కుట్ర కేసులో కింది కోర్టు విధించిన శిక్షల మీద అప్పీలు హైకోర్టుకు వచ్చిందని చెప్పాను గదా. అది సరిగ్గా ఎమర్జెన్సీ ఎత్తివేసిన కొద్దికాలం తర్వాత. అప్పుడు మొత్తంగా సమాజంలోనే గొప్ప ప్రజాస్వామిక వాతావరణం కనబడుతుంది. ప్రజలందరూ హఠాత్తుగా తమకు రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులున్నాయని గుర్తింపు పొందారు. ప్రభుత్వం రూల్ ఆఫ్ లాను ఉల్లంఘిస్తూ వచ్చిందని, గౌరవించడంలేని ప్రజలు హఠాత్తుగా కళ్లుతెరిచారు.
నిజానికి ఇందిరాగాంధీ పాలనకు చాలా ముందు నుంచే ఈ దేశంలో రూల్ ఆఫ్ లాను ఉల్లంఘించడం ప్రారంభమయింది.. ఆమె పాలనకన్నా ముందే బీహార్లో విచారణలో ఉన్న ఖైదీలు పదకొండు సంవత్సరాలపాటు జైళ్లలో మగ్గిపోయారు. దానికి ఇందిరాగాంధీ బాధ్యత ఏమీ లేదు. అంతకాలం విచారణ సాగుతున్నా ఖైదీలను విడిచిపెట్టలేదంటే దానికి బాధ్యత మన న్యాయస్థానాలు వహించాలి.
అప్పుడే బీహార్లో భాగల్పూర్ ఖైదీల కళ్లలో ఆసిడ్ పోసి అంధులను చేసిన ఉదంతాలు, బయటపడ్డాయి . దానిలో కూడా ఇందిరాగాంధీ బాధ్యత ఏమీ లేదు. ఇది ఇందిరాగాంధీ కన్నా ముందునుంచే జరుగుతూ వచ్చిన దారుణం. మన వ్యవస్థ, సమాజం అంతకు ముందు నుంచే కుళ్లుతూ వస్తూ ఉన్నాయన్నమాట. సరే, అట్లా ప్రజాస్వామిక వాతావరణం ఉన్న సమయంలో పార్వతీపురం అప్పీలు వచ్చింది. పత్తిపాటి వెంకటేశ్వర్లు చాలా మంది వకీళ్లచేత మోమో ఆఫ్ అప్పియరెన్స్ వేయించాడు. కాని చాలా మంది కోర్టుకు వచ్చి నిందితుల తరఫున వకాల్తా చేయనే లేదు.
ఒకవైపు ఆ పరిస్థితి ఉండగా, మరొక వైపు, పార్వతీపురం కుట్రకేసులో నిందితులుగా ఉన్న కార్యకర్తలలో చీలికలు, విభేదాలే వచ్చాయి . వారు తమకు ఫలానా న్యాయవాది అయితేనే వాదించాలని, ఫలానా వారు అయితే వద్దని అనడం మొదలు పెట్టారు. అంతకుముందే డిఫెన్స్ కమిటీ పని చేస్తున్న రోజుల్లో తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు నా దగ్గరికి వచ్చి ‘‘మా కేసు పత్తిపాటి వెంకటేశ్వర్లు మాత్రం చేయగూడదండి’’ అని నాకు చెప్పారు. అందువల్ల పార్వతీపురం అప్పీలు విచారణ మొదలు కాగానే నేను ఆ నిందితులందరికీ, మీ తరఫున ఎట్లా వాదించాలో ఎవరు వాదించాలో మీ చీలికలవైపు నుంచి చూసి చెప్పడానికి ప్రయత్నించకండి. అదంతా మాకు వదిలేయండి. ఎవరు వాదిస్తే, ఎట్లా వాదిస్తే మేలు జరుగుతుందో మేం ఆలోచిస్తాం అని చెప్పాను.
చౌదరి తేజేశ్వరరావు పెద్ద మనిషి. మంచివాడు. ఆయన సరే అని ఒప్పుకున్నాడు. ఆయన అప్పుడు చాలా ప్రముఖుడు. ఆయన మీద కూడా ఆరోపణలు ఉండేవనుకోండి. ఆయన అరెస్టు పెద్ద సంచలనం అయితే ఆయన ఏర్పాట్లన్నీ చేసుకుని అరెస్టయ్యాడని ఒక వదంతి ఉండేది. జస్టిస్ రామచంద్రరాజు కూడా ఆ మాటన్నారు. నేను అభ్యంతరం చెప్పాను. జడ్జి తన మాట వెనక్కి తీసుకున్నాడు.
నక్సలైటు రాజకీయాలలో వచ్చిన చీలికలను ఈ కేసు వాదనలలోకి కూడా తీసుకురావడానికి ప్రయత్నం జరిగింది. ఒకరిద్దరు న్యాయవాదులు కూడా ఆ మాదిరిగానే ఆలోచించడం మొదలుపెట్టారు. అప్పుడు నేను పద్మనాభరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడాను. ‘‘మనమంతా కలిసి ఉమ్మడిగానే వాదనలు పెడదాం. కుట్ర అని ఆరోపించడానికి తగిన ఆధారమైన, ‘కుట్రదారుల మధ్య ఒప్పందం’ అనేది లేదు అని మీరు వాదించి ఆ విషయం నిర్ధారించండి. ఆ తర్వాత చట్టపరమైన వాదనలు నేను వినిపిస్తాను’’ అని చెప్పాను. ఆ రకంగానే మా ఇద్దరి వాదనలు సాగాయి . జస్టిస్ సీతారామరెడ్డి కుట్ర జరగడానికి అవసరమైన ఒప్పందం లేదని నిరూపణ అయిపోయింది గనుక ఇక సాక్షుల విచారణ అవసరం లేదు అనే నిర్ధారణకు వచ్చేశారు. ఆయన అప్పుడే జడ్జిగా నియమితులయ్యారు. మరొక జడ్జి జస్టిస్ రామచంద్రరాజు మాత్రం పదమూడు, పద్నాలుగా మంది నిందితులు నేరం చేశారని నిర్ధారించి శిక్షలు విధించారు. అంటే ఇద్దరు న్యాయమూర్తులు ఒకరితో మరొకరు విభేదించారు. అప్పుడిక ఆ కేసు మూడో జడ్జి పరిశీలనకు వెళ్లింది. ఆ మూడో జడ్జి జస్టిస్ వక్తధర్.
సరిగ్గా అప్పుడే లాకప్లో అహ్మద్ హుస్సేన్ హత్య, రమీజాబీ రేప్, వాటి మీద ఆందోళన చెలరేగడం జరిగాయి . దాని మీద జస్టిస్ వక్తధర్ న్యాయవిచారణ కూడా జరిగింది. ఆ న్యాయ విచారణలో సిపిఐ(ఎం), సిపిఐ(ఎంఎల్) చురుగ్గా పాల్గొన్నాయి . ఆ విచారణ చాలా విస్తృతంగా జరిగింది. ఆ విచారణ క్రమంలోనే పోలీసులు ఎంత అక్రమంగా, చట్టవ్యతిరేకంగా ప్రవర్తిస్తారో జస్టిస్ వక్తధర్కు చాలా బాగా అర్థమయింది . అంటే ఆ అనుభవంతో, ఆ అవగాహనతో ఆయన పార్వతీపురం కుట్రకేసు విచారణకు వచ్చాడు. ఆయన మా వాదనలన్నీ విన్నాడు. ఆయన ఒక్కడే అయినప్పటికీ, ఆయన ఇవ్వబోయే తీర్పు అంతిమం. ఇక అక్కడ మెజారిటీ, మైనారిటీ అనే మాట లేదు. ఆయన ఆ కుట్ర కేసులోని నిందితులందరినీ వదిలి పెట్టాలని తీర్పు ఇచ్చాడు. కుట్ర జరిగిందని ప్రాసిక్యూషన్ నిరూపించలేక పోయిందని తీర్పు ఇచ్చాడు. తీర్పు ప్రకటించిన తర్వాత, ‘‘కన్నబీరాన్ , ఆ రమీజాబీ విచారణలో నాతో ఒక సుదీర్ఘ నివేదిక రాయించారు. ఇప్పుడు ఈ కేసులో మరొక సుదీర్ఘమైన ఎండు వందల పేజీల పైన తీర్పు రాయించారు.’’ అన్నాడు.
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం




