- పర్యాటక ప్రాంతాల్లో టూరిస్టు పోలీస్ స్టేషన్లు
- రాష్ట్రంలోని 20 పర్యాటక ప్రాంతాల్లో ఏర్పాటు
- ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం
హైదరాబాద్, ఫిబ్రవరి 14 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యాటక రంగం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 20 పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పర్యాటకులకు భద్రత కల్పించడం, సమాచారం అందించడమే లక్ష్యంగా వీటిని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించారు. దిశ యాప్?ను రాష్ట్ర వ్యాప్తంగా కోటి 20 లక్షలకు పైన మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారన్న ముఖ్యమంత్రి జగన్.. దిశ యాప్లో ఫిర్యాదు చేస్తే 5 సెకన్ల లోపు రిప్లై ఇస్తున్నామని, 5-10 నిమిషాల సమయంలోనే ఘటనా స్థలానికి వెళ్తున్నామని వెల్లడించారు.
గ్రామస్థాయిలోనే మహిళా పోలీసులు, గ్రామ సచివాలయాల ద్వారా అందుబాటులోకి వచ్చారు. జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాం. పోలీసు స్టేషన్లలో రిసెప్షనిస్టులను ఏర్పాటు చేశాం. వారి ద్వారా కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన వారి నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నాం. టూరిస్టు పోలీసు స్టేషన్లలో కియాస్క్లు ఏర్పాటు చేశాం. కియోస్క్లపై టెలిఫోన్ నెంబర్ అందుబాటులో ఉంచుతాం. దిశ యాప్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయాలను తెలిపేందుకు కరపత్రాలు సిద్ధం చేశాం. వీటిని టూరిస్టు పోలీసు స్టేషన్లలో అందుబాటులో ఉంచుతామన్నారు.
ఎమర్జెన్సీ సమయంలో అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచుతున్నామని సీఎం జగన్ తెలిపారు. పర్యాటక, పుణ్య క్షేత్రాల్లో భద్రతకు భరోసా ఇస్తూ టూరిస్టు పోలీసు స్టేషన్లు పనిచేస్తాయని స్పష్టం చేశారు. టూరిస్టు పోలీసు స్టేషన్లలో సిబ్బంది అంకిత భావం, సేవాభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. అదేవిధంగా విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన టూరిస్ట్ పోలీస్ బూత్ సీఎం జగన్ వర్చువల్గా ప్రారంభించారు. పోలీస్ బూత్తోపాటు 10 ద్విచక్ర వాహనాలు, రెండు పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించారు. నగరానికి వచ్చే పర్యాటకులకు మరింత భద్రత చేకూరేల బీచ్ పోలీసింగ్ను తీర్చిదిద్దారు.



