- కకుంభకోణాన్ని కప్పిపుచ్చే యత్నం
- కపేపర్ లీక్ కాకపోతే బీహార్లో, గుజరాత్లో అరెస్టులు ఎందుకు జరిగాయి…
- కకాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆరోప
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జూన్ 14 : నీట్ పరీక్షకు సంబంధించి పేపర్ లీక్, అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నా, విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నా ఈ అంశంపై మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ప్రశ్నించారు. సుప్రీమ్ కోర్టు పర్యవేక్షణలో ఫోరెన్సిక్ దర్యాప్తు మాత్రమే లక్షలాది మంది యువకుల భవిష్యత్తును కాపాడుతుందని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ద్వారా నీట్ కుంభకోణాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నదని ఖర్గే రోపించారు. నీట్లో పేపర్ లీక్ కాకపోతే ఆ కారణంతో బీహార్లో 13 మంది నిందితులను ఎందుకు అరెస్టు చేశారని ఖర్గే ఈ సందర్భంగా చేసిన తన ట్వీట్లో ప్రశ్నించారు.
పాట్నా పోలీసుల ఆర్థిక నేరాల విభాగం విద్యార్హతకు రూ. 30 లక్షలు-రూ. 50 లక్షల చెల్లింపును బహిర్గతం చేయలేదా..మాఫియా మరియు వ్యవస్థీకృత ముఠాలు రాకెట్లో పాల్గొంటున్నాయా..అంటూ ప్రశ్నించారు. గుజరాత్లోని గోద్రాలో నీట్-యుజి చీటింగ్ రాకెట్ను ఛేదించలేదా అని ప్రశ్నిస్తూ..గుజరాత్ పోలీసుల ప్రకారం, 12 కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు జరిగాయని, ఇందులో కోచింగ్ సెంటర్ నడుపుతున్న వ్యక్తి, ఉపాధ్యాయుడు, మరొక వ్యక్తితో సహా ముగ్గురు వ్యక్తులు ఉన్నారని ఖర్గే అన్నారు. మోదీ ప్రభుత్వం చెబుతున్నట్లుగా నీట్లో పేపర్ లీక్ కాకపోతే ఈ అరెస్టులు ఎందుకు చేశారని ఆయన ప్రశ్నించారు. వీటన్నిటినీ బట్టి చూస్తే మోదీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేయడానికి ఇంతకు ముందైనా లేదా ఇప్పుడైనా ప్రయత్నిస్తున్న నిర్ధారణ అవుతున్నదని ఖర్గే పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం 24 లక్షల మంది యువత ఆకాంక్షలను తుంగలో తొక్కిందని ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీట్ అవకతవకలపై సిబిఐ దర్యాప్తుపై నోటీసులు
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జూన్ 14 : ఈ ఏడాది మే 5న జరిగిన నీట్-యూజీ 2024 పరీక్ష నిర్వహణలో పేపర్ లీక్, అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీమ్ కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాతో కూడిన వెకేషన్ బెంచ్ ఇదే అంశానికి సంబంధించి ఇదివరకు దాఖలైన పిటిషన్లతో కలిపి కేసులన్నిటిని తదుపరి విచారణకు జూలై 8కి వాయిదా వేసింది. శుక్రవారం విచారణ సందర్భంగా 2 వారాల్లోగా ప్రతిస్పందన దాఖలు చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఆదేశించగా, కేంద్రానికి తదుపరి విచారణ వరకు సమయాన్నిచ్చింది.
కాగా 24 లక్షల విద్యార్థుల భవిష్యత్తుపై తాము పట్టింపుతో ఉన్నామని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అయితే ప్రతివాదుల వాదనలు వినకుండా ఏక పక్షంగా తాము సిబిఐ విచారణకు ఆదేశించలేమని సుప్రీమ్ కోర్టు స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా, కోటాలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఒకరు కోర్టు దృష్టికి తేవడానికి ప్రయత్నించగా ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. కోటాలో ఆత్మహత్యలు నీట్-యూజి 2024 ఫలితాల వల్ల జరగలేదని వ్యాఖ్యానించిన జస్టిస్ నాథ్, ‘‘ఇక్కడ అనవసరమైన భావోద్వేగ వాదనలు చేయవద్దు’’ అని వ్యాఖ్యానించారు.




