తిరుమల, డిసెంబర్ 8 : శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నిర్విఘ్నంగా అన్నప్రసాద వితరణ జరగాలని ప్రార్థిస్తూ గురువారం ఆయుధపూజ నిర్వహించారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదాల తయారీకి వినియోగించే సామగ్రికి, యంత్రాలకు పూజలు చేసినట్టు టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. నిత్యం వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతున్న క్రమంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని భగవంతుని ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం అన్నప్రసాద భవనంలో సాంప్రదాయబద్ధంగా ఆయుధపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నదన్నారు.
1983లో అన్నదానం ప్రారంభమైందని , 2009లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం నిర్మించి రోజుకు దాదాపు 14 గంటల పాటు నిరంతరాయంగా భక్తులకు అన్న ప్రసాదాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నప్రసాదం డిప్యూటీ ఈవో సెల్వం, ప్రత్యేక అధికారి జి.ఎల్.ఎన్.శాస్త్రి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, విజివో బాల్ రెడ్డి, ఏఈవోలు గోపీనాథ్, గంగాధరం, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇదిలావుంటే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది .
నాలుగు కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.నిన్న స్వామివారిని 51,376 మంది భక్తులు దర్శించుకోగా 24,878 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి ఆదాయం రూ. 4.60 కోట్లు వచ్చిందని తెలిపారు.




