నా వ్యాఖ్యల వక్రీకరణ మోదీ తీరుపై మండిపడ్డ రాహుల్

న్యూదిల్లీ,మార్చి18: ‘శక్తి’పైనే పోరాటం అంటూ తాను చేసిన వ్యాఖ్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వక్రీకరించారని రాహుల్ గాంధీ అన్నారు. ముంబైలో రాహుల్ సోమవారంనాడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో ఆయన తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో తన వాదన వినిపించారు. మోదీ నా మాటలు ఇష్టపడరు. ఆయన నా మాటలు వక్రీకరించేందుకు, అర్ధం మార్చిచెప్పేందుకు ప్రయత్నించారు. ఎందుకంటే… ఆయనకు నేను లోతైన సత్యాన్ని చెప్పిన విషయం బాగా తెలుసు’ అని రాహుల్ అన్నారు. ఎవరిదైతే తాము పోరాటం సాగిస్తున్నామో దానినే శక్తి అని తాను సంబోధించానని, ఆ శక్తి మోదీనే అని అన్నారు.

ఆ శక్తి భారతదేశ వాణిని, సంస్థలను, సీబీఐ, ఐటీ శాఖ, ఈడీ, ఎన్నికల కమిషన్, డియా, పరిశ్రమలు, రాజ్యాంగ వ్యవస్థను తమ చెప్పుచేతుల్లో పెట్టుకుంటోందని వ్యాఖ్యానించారు. ఆ పవర్తోనే నరేంద్ర మోదీ వేలకోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తుండగా, స్వల్పమైన రుణాలను కూడా తీర్చలేక రైతులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోందని విమర్శించారు. ‘శక్తి’ వ్యాఖ్యల వివాదం ముంబైలో ఆదివారం జరిగిన ‘భారత్ జోడో న్యాయయాత్ర’ ముగింపు సమావేశంలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, మోదీపై పోరాటం వ్యక్తిగతం కాదన్నారు. శక్తి(అధికారం)కి వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని, ఇక్కడ శక్తి అంటే ఏమిటనే ప్రశ్న ఉందని అన్నారు. రాజు (మోదీ) ఆత్మ ఈవీఎంలు, ఈడీ, సీబీఐ, ఆదాయం పన్ను సంస్థల్లో ఉందని, అవి లేకుండా గెలవలేరని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలను ప్రధాన మంత్రి మోదీ తెలంగాణలోని జగిత్యాలలో సోమవారం జరిగిన ర్యాలీలో తిప్పికొట్టారు. తమ పోరాటం శక్తితోనేనంటూ ‘ఇండి’ కూటమి చెబుతోందని, తన వరకూ ప్రతి తల్లి, చెల్లి, కూతురు అంతా శక్తిస్వరూపాలేనని, శక్తి రూపంలో వారిని ఆరాధిస్తానని, తాను భరతమాత ఆరాధకుడినని చెప్పారు. ఈ శక్తిని అంతం చేస్తామంటూ ‘ఇండి’ కూటమి సవాలును ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *