ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 30 : కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో నవంబర్ 1న జరిగే ఎన్నికల భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ వస్తున్నట్లు సిడబ్ల్యూసి నాయకులు చల్లా వంశీచంద్ రెడ్డి, కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాసింగ్ తెలిపారు. సోమవారం సాయంత్రం కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ భారతదేశా సమగ్రతను కాపాడే వ్యక్తి రాహుల్ గాంధీ అని అన్నారు. దేశానికి కాబోయే భావిభారత ప్రదానీ రాహుల్ గాంధీ నవంబర్ 1న కల్వకుర్తికీ రానున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ భారీ బహిరంగ సభకు కల్వకుర్తి నియోజకవర్గం లోని గ్రామ గ్రామాన పల్లె పల్లెనా నలుమూలల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి బిఎస్ఎన్ఎల్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను వారు పర్యవేక్షించారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించబోతుందని రాబోయే అసెంబ్లీ స్థానాల్లో 80 స్థానాలు కైవసం చేసుకోనున్నట్లు వారు ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిపాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజల వ్యతిరేక ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనలను తిప్పి కొట్టడానికి రాహుల్ గాంధీ ఇటీవల భారత్ జూడో యాత్రను ప్రారంభించడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయణరెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రతి కార్యకర్త ఒక సైనికుడి లా పోరాటం చేసి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. ఆరు గ్యారంటీలతోనే కాకుండా మరో మేనిఫెస్టోను తెలంగాణ ప్రజల ముందు ఉంచబోతున్నట్లు వారు తెలిపారు.
నవంబర్ 1న కల్వకుర్తికి రాహుల్ గాంధీ రాక




