- పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కెటిఆర్
- సత్వరం పూర్తి చేయాలని ఆదేశం
హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి4: సెంట్రల్ హైదరాబాద్ నగరానికి స్టీల్ బ్రిడ్జి తలమానికంగా మారబోతుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. మూడు నెలల్లో వంతెన పనులు పూర్తి చేయాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. అవసరమైతే అదనపు బృందాలు ఏర్పాటు చేసి పనులు వేగవంతం చేయాలని సూచించారు. ముషీరాబాద్ నియోజక వర్గంలో మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులతో పాటు ఎస్ఎన్డీపీ పనులను కేటీఆర్ పరిశీలించారు. లోయర్ ట్యాంక్ బండ్ నుంచి వీఎస్టీ వరకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులను కేటీఆర్ పరిశీలించి, తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. .8 కిలోటర్ల పొడవైన నాలుగు వరుసల స్టీల్ బ్రిడ్జి కోసం జీహెచ్ఎంస రూ. 440 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు.
స్టీల్ బ్రిడ్జి నిర్మాణం తర్వాత ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. ఇదే సందర్బంలో హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలాలో చేపడుతున్న పనులను కూడా కేటీఆర్ పరిశీలించారు. అశోక్ నగర్ వద్ద కొనసాగుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను కేటీఆర్ పరిశీలించారు. వరద ప్రవాహన్ని తగ్గించే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టామని కేటీఆర్ తెలిపారు.హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలాకు భారీగా నిధులు కేటాయిం చామని స్పష్టం చేశారు. వర్షాకాలం నాటికి పనులన్నీ పూర్తి చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు.మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే ముఠాగోపాల్ తదితరులు పాల్గొన్నారు.