సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: దేశానికే ఆదర్శంగా నిలిచేలా జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. త్వరలో జిల్లాకు ఇంటర్నేషనల్ యునిసెఫ్ బృందం రానున్న నేపథ్యంలో న్యూఢిల్లీ హైదరాబాదు నుంచి వచ్చిన యూనిసెఫ్ బృందం సభ్యులు గజ్వేల్ లోని కోమటిబండ మిషన్ భగీరథ నాలెడ్జ్ సెంటర్ లో మిషన్ భగీరథ పథకం ద్వారా రాష్ట్రంలో త్రాగునీరు ఎలా సరఫరా చేస్తున్నది. జగదేవ్ పూర్ మండలంలోని ఎర్రవెళ్లి, మర్కుక్ మండల కేంద్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలలో నిర్వహిస్తున్న పచ్చదనం, పరిశుభ్రత మరియు గ్రామ అభివృద్ధి పనులను, సిద్దిపేట పట్టణంలోని స్వచ్ఛ బడిని పరిశీలించారు.అనంతరం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) గరీమా అగర్వాల్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ప్రొజెక్టర్ ద్వారా జిల్లాలో మహిళల ఆరోగ్య సంరక్షణ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రత్యేక చొరవతో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో చేపట్టిన ఋతుప్రేమ కార్యక్రమం గురించి వివరిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచేలా జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతు ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములను చేస్తూ జాతీయస్థాయిలో అనేక అవార్డులను జిల్లా సొంతం చేసుకుందని వివరించారు. అలాగే సిద్దిపేటలోనే రూపొందించబడిన స్వచ్ఛబడి కార్యక్రమం, ఋతుప్రేమ కార్యక్రమాలు సిద్దిపేట జిల్లాకు జాతీయ స్థాయిలో ప్రత్యేకతను తీసుకువచ్చాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో యునిసెఫ్ సభ్యులు రాధిక, రాఘవరోరా, వెంకటేష్, డిపిఓ దేవకీదేవి, ఎస్ఇ ఆర్డబ్ల్యూఎస్ చారి, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్.కాశీనాథ్, సెట్విన్ కోఆర్డినేటర్ అమీనా, తదితరులు పాల్గొన్నారు.


