- ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి దిల్లీకి
- రేపు బిఆర్ఎస్ కార్యాలయ ప్రారంభం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12 : ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం దిల్లీకి చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ బయల్దేరి వెళ్లారు. రేపు దిల్లీలోని సర్దార్పటేట్ మార్గ్లో బీఆర్ఎస్(భారత రాష్ట్ర సమతి) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. నేపథ్యంలో పార్టీ నూతన కార్యాలయం ప్రారంభానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఢిల్లీలో మంగళ, బుధవారాల్లో రాజశ్యామల యాగం నిర్వహించనున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్కుమార్ ఆది, సోమవారాల్లో ప్రముఖ వాస్తు శిల్పి సుద్దాల సుధాకర్ తేజతో కలిసి ఆయా ఏర్పాట్లను పరిశీలించారు. వాస్తుకు అనుగుణంగా కార్యాలయాన్ని తీర్చిదిద్దుతున్నారు.
సుధాకర్ తేజ సూచనల ప్రకారం పార్టీ కార్యాలయ భవనంలో మార్పులు, చేర్పులు, మరమ్మతు పనులు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ ప్రతినిధులు హాజరుకానున్నారు. వారితో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున చట్ట సభల ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం దిల్లీకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు.




