దసరా ముందు విషాదం

  • సూర్యలంక బీచ్‌లో ఏడుగురి గల్లంతు
  • ముగ్గురు విద్యార్థుల మృతి.. ఇద్దరిని కాపాడిన జాలర్లు
  • మరో ఇద్దరి కోసం ఎన్టీఆర్‌ఎఫ్‌ ‌సిబ్బంది గాలింపు

గుంటూరు,అక్టోబరు 4 : దసరా సెలవులు వారి ఇంట విషాదం నింపాయి. విహారయాత్రకు వెళ్లిన ఏడుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన బాపట్ల సూర్యలంక తీరంలో చోటుచేసుకుంది. దసరా సెలవుల్లో భాగంగా విజయవాడకు చెందిన కొందరు విద్యార్థులు బాపట్లలోని సూర్యలంక బీచ్‌కు వెళ్లారు. ఈ సమయంలో అందరూ కలిసి నీటిలో దిగారు. భారీ అలలు ఒక్కసారిగా రావడంతో ఉధృతికి సముద్రంలోకి కొట్టుకుపోయారు.

ఏడుగురు విద్యార్థులు కూడా ఒక్కసారిగా నీటిలో మునిగి గల్లంతయ్యారని స్థానికులు తెలిపారు. కాగా.. సముద్రంలోకి దిగిన ఏడుగురిలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరిని స్థానికులు, గజ ఈతగాళ్లు కాపాడారు. మరో ఇద్దరి కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ ‌బృందాలతో గాలిస్తున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను విజయవాడలోని సింగ్‌నగర్‌కు చెందిన సిద్ధు, అభి, సాయి మధుగా గుర్తించారు.

ఫణి, రాఘవ, ప్రభు దాసు ఆచుకీ ఇంకా లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. వీరంతా ఎనిమిది, తొమ్మిది, పది తరగతులు చదువుతున్న పిల్లలని పోలీసులు తెలిపారు. దసరా సెలవులు కావడంతో ఉదయం వీరంతా ట్రైన్‌లో బాపట్లకు చేరారు. అక్కడ నుంచి ఆటోలో సూర్యలంకకు వెళ్లామని.. క్షేమంగా బయటకు వచ్చిన బాలుడు తెలిపారు. కాగా.. ఈఘటనతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *