దక్షిణాఫ్రికాలోని ఒక విశ్వవిద్యాలయ శిలాఫలకం పై “ఏ దేశమైన నాశనమవ్వడానికి అణుబాంబులు అక్కర్లేదు, అణ్వస్త్ర ఆయుధాలు అంతకంటే అక్కర్లేదు, ఆ దేశం లో లోపభూయిష్టమైన నిర్వీర్యమైన విద్యావ్యవస్థ అన్ని వ్యవస్థలను నీచ స్థితికి దిగజార్చుతుంది “. నేడు దేశవ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలలు విశ్వవిద్యాలయాలలో విద్యా ప్రమాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గణితం, సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్లలో పదవ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యం వరుసగా 32 శాతం, 35 శాతం, 37శాతం, 43శాతంగా నమోదయ్యాయని ‘నేషనల్ అచీవ్మెంట్ సర్వే’ పేర్కొన్నది. 2017నాటి జాతీయ సర్వేతో పోల్చితే, 2021సర్వేలో సగటు ఫలితాలు పడిపోయాయని తెలిపింది. తమిళనాడు, తెలంగాణ, మేఘాలయ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జాతీయ సగటు కన్నా దిగువన ఫలితాలు నమోదయ్యాయి. ముఖ్యంగా కరోనా సంక్షోభం విద్యార్థుల చదువుల్ని కకావికలం చేసింది. సామాజికంగా, ఆర్థికంగా మెరుగైన కుటుంబాల పిల్లలకు ఆన్లైన్ చదువులు అందుబాటులో ఉన్నాయని, మిగతావారికి కష్టసాధ్యమైందని సర్వే ఫలితాలు తెలిపాయి. ఆన్లైన్ ద్వారా సమాన విద్యావకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి అని సర్వేలు చెబుతున్న దిద్దుబాటు చర్యలకు ప్రభుత్వాలు పూనుకోవడం లేదు. భాషానైపుణ్యం, పర్యావరణ శాస్త్రం, సైన్సు, గణితం, సామజిక శాస్త్రాలలో పిల్లలు వెనుకబడ్డారు. తాజాగా కాగ్ నివేదిక ఆసక్తికర అంశాలు బయట పెట్టింది.
ఐఐటీ, ఎన్ఐటీల్లో పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ఏటా సీట్లు భారీగా మిగిలిపోతున్నాయని వెల్లడించింది.ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు బీటెక్తోనే మంచి ఉద్యోగాలు వస్తుండటంతో ఎక్కువ మంది విద్యార్థులు పీజీ, పీహెచ్డీ వైపు మొగ్గు చూపడం లేదు. అలాగే బీటెక్లోని కొన్ని కోర్ ఇంజినీరింగ్ కోర్సుల్లోనూ సీట్లు భర్తీ కావడం లేదు. ఈ సమస్య ప్రధానంగా కొత్త ఐఐటీల్లో కనిపిస్తోందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో పరిశోధన పడకేసి దశాబ్దం అవుతుంది. ప్రతి సంవత్సరం నిర్వహించాల్సిన రీసెట్ ఎంట్రన్స్ పరీక్ష మూడు సంవత్సరాల కొకసారి నిర్వహిస్తూ ఇంటర్వ్యూలు అడ్మిషన్లు సంవత్సరం కాలం తీసుకుంటున్నారు. చాలా విశ్వవిద్యాలయాలలో అధ్యాపకులు లేక విభాగాలు మూసివేశారు. ఉన్న అరకొర అధ్యాపకులు డైరెక్టర్లు గా, ప్రిన్సిపాల్, రిజిస్ట్రార్, రెక్టార్లు, విసి లు గా చలామణి అవుతున్నారు. నకిలీ విశ్వవిద్యాలయాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. 2020 లో అడ్మిట్ అయిన స్కాలర్ 2022 కు పట్టా ఇస్తున్నారు. విశ్వవిద్యాలయంలో కంప్యూటర్, ఎంబీఏ విభాగాలలో చదువు చెప్పే వారే లేరు. బాసరలో వెలసిన ట్రిపుల్ ఐఐటి పరిస్థితి ఎలా ఉందో అనంతపురంలో వెలసిన కేంద్ర విశ్వవిద్యాలయం పరిస్థితి అలాగే ఉంది. అక్కడ విసి, అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు లేవు ఇక్కడ కేంద్ర విశ్వవిద్యాలయం పెట్టి ఏడు సంవత్సరాలు కావస్తున్నా అద్దె భవనంలో ఉంది. అక్కడ ఉన్న శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, కాకతీయ విశ్వవిద్యాలయాలలో పట్టుమని పది మంది శాశ్విత అధ్యాపకులు లేరు చివరికి వంద సంవత్సరాల ఘనకీర్తి ఉన్న ఉస్మానియాలో అరవై మంది అధ్యాపకులు లేరు.
ఆంధ్రాలో వెలసిన నన్నయ్య, యోగి వేమన, ద్రావిడ, అంబేద్కర్, విక్రమ్ సింహపురి, పద్మావతీ, రాయలసీమ విశ్వవిద్యాలయాలలో పట్టుమని పదిమంది శాశ్విత అధ్యాపకులు లేరు. కర్నూల్ జిల్లాలో రాయలసీమ విశ్వవిద్యాలయం, ఐఐటిడిఎం, ఆంధ్ర ప్రదేశ్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి అనే సంగతి ప్రక్కన పెడితే ఇప్పుడు కొత్తగా జగన్నాథ గట్టు దగ్గర క్లస్టర్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఇక ఉర్దూ విశ్వవిద్యాలయం ఒకటుందని ప్రభుత్వం ఎప్పుడో మరచిపోయింది. అవి ఎలా ఉన్నాయి అనే సంగతి ప్రక్కన పెడితే ఇప్పుడు కొత్తగా జగన్నాథ గట్టు దగ్గర క్లస్టర్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. అధ్యాపకులు లేక కీలక విభాగాలు మూసివేతకు గురైనాయి పొలిటికల్ సైన్స్, పాలిమర్ సైన్స్, స్టాటిస్టిక్స్, సెరికల్చర్, జువాలజీ, బయోకెమిస్ట్రీ , ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఎకనామిక్స్, హిస్టరీ, సోషల్ వర్క్, రూరల్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్ , జియాలజీ, మ్యాథమెటిక్స్ , ఇన్స్ట్రుమెంటేషన్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విభాగాలల్లోను ఒకే ఒక్కరితో నడుపుతున్నారు. ఇక్కడ పని చేసే శాశ్విత అధ్యాపకులు మైనర్,మేజర్ రీసర్చ్ ప్రాజెక్టులకు అప్ప్లై చేసిన పాపాన పోవడం లేదు. రీసర్చ్ గ్రాంట్ అనేది తెలియని స్థితిలో అధ్యాపకులు ఉన్నారు. రీసర్చ్ గ్రాంట్లే కాదు కాన్ఫరెన్సు లు, సెమినార్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలకు, స్టాఫ్ డెవలప్మెంట్ కోర్సులు, రిఫ్రెషర్ , ఓరియంటేషన్ కోర్సులు దశాబ్ద కాలంలో జరగలేదు. అకడమిక్ స్టాఫ్ కాలేజీలు, ఎలెక్ట్రానిక్ మల్టీమీడియా రీసర్చ్ సెంటర్లు నిధులు లేక పని లేక వెలవెలబోతున్నాయి.
అధ్యాపకులకు బోధనా సామర్థ్యాలు లేక కొత్త విషయాల పట్ల ఆసక్తి చచ్చిపోయింది. ఇక ఫిజిక్స్, కెమిస్ట్రీ , ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలెక్ట్రానిక్స్, జువాలజీ,వృక్ష శాస్త్ర విభాగంలో టెక్నీషియన్లు, ల్యాబ్ అటెండర్లు లేక ప్రయోగ శాలలు మూతపడ్డాయి. ఇరవై సంవత్సరాల క్రిందట విశ్వవిద్యాలయంలో సీటు రావాలంటే గగనంగా ఉండేది. ఒకప్పుడు విశ్వవిద్యాలయంలో సీటు కలగా ఉండేది కానీ ఇప్పుడు గుదిబండగా మారింది. పది సబ్జెక్టులు, నాలుగు ప్రాక్టికల్స్ ఉన్న విభాగంలో ఇద్దరు అధ్యాపకులు ఎలా చెప్పగలరు? చాలా మంది అధ్యాపకులు ఎవడెట్లా పోతే నాకెందుకు ఇంకా రెండు సంవత్సరాలు ఉంటే నేను రిటైర్ అయిపోతాను ఈ లోగా ఏదో అదృష్టం బాగుండి దిక్కుమాలిన విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా వెళితే సరిపోతుంది అనుకుంటున్నారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి తీరు డబ్బే పరమావధిగా ఉంది. తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి అవినీతి కేసులో అరెస్టు కాగా, కాకతీయ యూనివర్సిటీ వీసీ పై విజిలెన్స్ దర్యాప్తులు, మరొక ఉపకులపతి తన బంగ్లా నవీకరించడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. అనుబంధ కళాశాలలకు అదనపు కోర్సులు రావాలన్నా, అధ్యాపకుల రాటిఫికేషన్ కావాలన్న లక్షలు ముడుపు చెల్లించుకోవాల్సిందే. విద్య ప్రమాణాలు పెంచుదాం, విద్యార్థులకు పాఠాలు బోధి ద్దాం అనే తపన ఎవరికీ లేదు. పేపర్లు, పుస్తకాలు వ్రాసి అకడమిక్ గా అభివృద్ధి పొందుదాం అని అనుకోవడం లేదు. అధ్యాపకుల సమస్య ఉందని తెలిసిన ప్రభుత్వాలు ఉదాశీనంగా ఉండడం చూస్తుంటే ప్రభుత్వం విద్యను పూర్తిగా విస్మరించిందని చెప్పవచ్చు.
రౌతు మెత్తగుంటే గుర్రం మూడు కాళ్లతో పరుగెత్తిందంటారు. యుజిసి, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ ఇతర నియంత్రణ సంస్థల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రైవేటు విశ్వవిద్యాలయాల అడ్డు అదుపు లేకుండా పోయింది. అడుగు వ్యవసాయ భూమి లేకపోయినా అగ్రికల్చర్, హార్టికల్చర్, పారెస్ట్రీ, అగ్రికల్చర్ మేనేజిమెంట్ కోర్సులు నడుపుతూ ఎలాంటి గుర్తింపు లేకున్నా విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెడుతున్న విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వాలకు అదుపు లేకుండా పోయింది. మరియొక వైపు ఇలాంటి చెత్త కళాశాలలను అడ్మిషన్ పోర్టల్ లో ఉంచి ప్రభుత్వమే వీటి సీట్లను భర్తీ చేస్తున్నారు. దొంగ సర్టిఫికెట్లు, దొంగ చలాన్లు ముద్రించిన వారిపై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం, ఇంకొకవైపు బడా బాబులు అన్ని అరాచక పద్ధతులలో అక్రమంగా డబ్బు దండుకుంటుంటే వారిని ప్రోత్సహిస్తున్నారు. దొంగ సర్టిఫికేట్లు, దొంగ నోట్ల చలామణి ఎంత నేరమో విద్యా సంస్థలను, విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి అమాయక విద్యార్థులనుండి కోటాను కోట్ల డబ్బు వసూలు చేసి మూడు నాలుగు సంవత్సరాల తరువాత ఎందుకు పనికిరాని ఎక్కడ గుర్తింపు లేని సర్టిఫికెట్ ఇచ్చి బయటకు పంపుతున్నా ఏమాత్రం చర్యలకు ఉపక్రమించని ఉన్నత విద్య అధికారులు అంతే నేరానికి పాల్పడుతున్నారు. డబ్బే పరమావధిగా భావించే ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. రాష్ట్రంలో కొన్ని నర్సింగ్, బి ఎస్సి అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు షాపింగ్ కాంప్లెక్స్ లోను, కమర్షియల్, లాడ్జిలో, అద్దె భవనాలలో ఉంటున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సువిశాలమైన అత్యాధునిక వసతులతో శాశ్వత భవనాలు అని ప్రచారం చేస్తూ ఏడు సంవత్సరాలుగా కాలం వెళ్ళబుచ్చుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇలాంటి విశ్వవిద్యాలయంలో ఎక్కడా లేని దిక్కుమాలిన కోర్సులు ఉంటున్నాయి . బి ఎస్సి అగ్రికల్చర్, బి ఎస్సి హార్టికల్చర్, బి ఎస్సి ఫారెస్ట్రీ, ఎంబిఏ అగ్రికల్చర్. ఏ ఒక్క కోర్సుకు ఐ కార్ అనుమతి లేదు.
ఇండియన్ కౌన్సిల్ ఫార్ అగ్రికల్చర్ రీసర్చ్ గుర్తింపు ఉండాలంటే కనీసం వంద ఎకరాల వ్యవసాయ భూమి ఉండాలి. ఇలాంటి విశ్వవిద్యాలయాలకు సెంటు భూమి లేదు, కళాశాలలో అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ కోర్సులు బోధించడానికి పట్టుమని నలుగురు అధ్యాపకులు ఉండరు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, కులపతులు ఎక్కువగా నియంత్రణ మండళ్లల్లో పని చేసి రిటైర్ అయిన వ్యక్తులు నియమించడం జరుగుతుంది. ఎందుకంటే వీరి పరపతి ఉపయోగించి కోర్సులకు అప్రూవల్ తెస్తారని ధీమా. ఇలాంటి విశ్వవిద్యాలయంలో మూడు సంవత్సరాల విద్యనభ్యసించే విద్యార్థులకు వ్యవసాయం పై కనీస అవగాహన ఉండదు, అగ్రానమి, సాయిల్ సైన్స్, క్రాప్ ప్రొడక్షన్, హార్వెస్టింగ్, పెస్ట్ కంట్రోల్ , ప్లాంట్ పాథాలజీ, వీడ్ మేనేజిమెంట్, పెస్ట్ మేనేజ్మెంట్ పై అవగాహన లేదు. సుదూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలు ఇలాంటి విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్నారు. మూడు నాలుగు సంవత్సరాల తరువాత ఐ కార్ గుర్తింపు లేని, వ్యవసాయం పై కనీస అవగాహన లేని విద్యార్థులు వీళ్ళీచ్ఛే సర్టిఫికెటు తో ఎవరికి ఉద్యోగం రాదు. కనీసం వీరికి ఏమైనా వ్యవసాయం, ఫలసాయం, ఫారెస్ట్రీ పై ఏమైనా ప్రవేశం ఉన్నదా అంటే అది లేదు. రాష్ట్రంలో చాల ప్రైవేటు విశ్వవిద్యాలయాలు రీసర్చ్ సూపర్వైజర్లు లేకున్నా పిహెచ్డి లు నడుపుతున్నాయి. రీసర్చ్ విభాగం ఉండదు, గైడ్లు ఉండరు, 2020 లో చేరిన విద్యార్థికి 2018 లో అడ్మిషన్ అయినట్లు చేసి 2021 లో పిహెచ్డి ప్రధానం చేస్తున్నారు. ఎక్కడో ఉత్తరాదిన ఇలాంటి బోగస్ విశ్వవిద్యాలయాలు ఉండేవి. అనంతపురంలో వెలసిన ప్రైవేటు విశ్వవిద్యాలయం పట్టుమని ముగ్గురు డాక్టరేట్లు లేరు 28 కోర్సులలో పిహెచ్డి ప్రవేశ పరీక్షలు నిర్వహించింది. ఐదు వేలు అప్లికేషన్ ఫీజు, 25000 అడ్మిషన్ ఫీజు, ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు ట్యూషన్ ఫీజు. విదేశాల నుంచి విద్యార్థులు రీసర్చ్ స్కాలర్లు గా ఉన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు రీసర్చ్ గ్రాంట్లు లేవు, ఉన్న అరకొర నిధులు బ్లాక్ గ్రాంట్లు జీతభత్యాలకు సరిపోవడం లేదు. ఇప్పటికైనా మొద్దు నిద్ర మాని ఇలాంటి పనికిమాలిన విద్యాలయాల భరతం పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
డా. యం. సురేష్ బాబు,
రాష్ట్ర అధ్యక్షులు, ప్రజాసైన్స్ వేదిక





