పటాన్చెరు, ప్రజాతంత్ర, జనవరి 31 : సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం, తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాజ్ పుష్ప లైఫ్ స్టైల్ సిటీలో మంగళవారం ఐటీ దాడులు కొనసాగాయి. సిద్ధిపేట జిల్లా మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇంటిలోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఐదు బృందాలుగా విడిపోయి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం 50 ప్రాంతాల్లో ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. వసుధ ఫార్మా, రాజ్ పుష్ప, వెరిటెక్స్ సంస్థలలో ఆడిట్లను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్లు వినికిడి.
ఐదేళ్ల ఐటీ రిటర్నస్పై విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. భారీగా ఐటీపన్నులు ఎగవేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ దాడులు ఘటన ప్రాధాన్యతను సంతరించుకుంది. మధ్యాహ్నం నుండి రాజ్ పుష్ప లైఫ్ స్టైల్ సిటీలో ఐటి సోదాలు రాత్రి వరకు కొనసాగుతున్నాయి. ఐటీ సోదాలు వార్తలను కవర్ చేసేందుకు వచ్చిన మీడియాను లోపలికి అనుమతించకుండా రాజ్ పుష్ప సిబ్బంది అడ్డుకున్నారు. ఐటీ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





