- సింగరేణి ప్రైవేటీకరణ ఆలోచనను విరమించాలి
- టిఆర్ఎస్ ఎంపిల డిమాండ్
న్యూ దిల్లీ, డిసెంబర్ 7 : సింగరేణి కాలరీస్ తెలంగాణకి గుండెకాయ లాంటిదని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. సింగరేణి ప్రయివేటు పరం చేయొద్దని గతంలో ముఖ్యమంత్రి లేఖ రాశారన్న ఆయన…సింగరేణి ప్రయివేటు పరం చేయమంటూ ప్రధాని చెప్పారని గుర్తు చేశారు. ఈ రోజు తాము అడిగిన ప్రశ్నకు నాలుగు బ్లాకులు ప్రైవేట్ పరం చేస్తున్నామంటూ సమాధానం ఇచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రం అంటే చిన్న చూపని…నిధులు ఇవ్వద్దొని, మైన్స్ ఉండొద్దని కేంద్రం చూస్తుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేశారని చెప్పారు.
సింగరేణి కాలరీ తమ రాష్ట్రానికి వదిలేయాలని కోరుతున్నానన్న ఎంపీ…కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న 49 పర్సెంట్ కూడా తాము తీసుకుంటామని చెప్తున్నామని తెలిపారు. కేవలం తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా 38 బ్లాక్ అమ్ముతున్నట్లు చెప్పారని ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సింగరేణి కాలరీ సౌత్ ఇండియాలోనే అతిపెద్ద కంపెనీ అని టిఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి చెప్పారు. సింగరేణిని వేలంలో ఎలా పెడతారు అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని కోరినా ఇవ్వట్లేదని ఆరోపించారు. పాలసీ ప్రకారం వేలం పెట్టామని కేంద్రం చెబుతుందని, 11 ఏ కండిషన్లో తమకు అలోకేట్ చేయమని కోరామన్నారు. నాలుగు బ్లాకులు ప్రయివేటు పరం చేయాలని చూస్తున్నారని తెలిపారు. ప్రయివేట్ పరం చేయడం వల్ల ఉద్యోగులు నష్టపోతారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి 51శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉందని ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి గుర్తు చేశారు.




