సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కాంగ్రెస్ కోసం కాదని..తెలంగాణ సమాజం కోసమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా తల్లంపాడు వద్ద పాదయాత్ర శిబిరంలో భట్టి విక్రమార్కతో శుక్రవారం రేవంత్ భేటీ అయ్యారు. అభివృద్ధి పేరుతో సీఎం కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారని..ఈస్ట్మన్ కలర్లో ప్రజలకు చూపిస్తున్న భ్రమలను పాదయాత్ర ద్వారా భట్టి ప్రజల దృష్టికి తీసుకెళ్లారన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో చూసిన సమస్యలు, వాటి పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోగా ఉంటుందన్నారు.
భట్టితో భేటీ అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఖమ్మంలో జన గర్జనసభ ఏర్పాట్లపై సమీక్షించేందుకు ఇక్కడకు వొచ్చాం. సభ ఏర్పాట్లపై భట్టి సలహాలు, సూచనలు తీసుకున్నాం. జులై 2న జరిగే సభకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతారు. ఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తాం. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు సభకు హాజరవుతారు. జనగర్జన సభకు జిల్లా ప్రజల నుంచి వొచ్చే స్పందనను అందరూ చూస్తారు’’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.



