ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : ప్రముఖ రిటైల్ చైన్ అయిన రత్నదీప్, తెలంగాణ ప్రభుత్వం, అకాడమీ ఫర్ స్కిల్, నాలెడ్జ్(టాస్క్), రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఆర్ఏఐ) భాగస్వామ్యంతో ‘మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్(ఎంఓయు)’ కుదుర్చుకున్నట్లు రత్నదీప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యష్ అగర్వాల్ ఒక ప్రకటనలో వెల్లడించారు. వరల్డ్ యూత్ స్కిల్ డే సందర్భంగా ‘రత్నదీప్ రిటైల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను స్థాపించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇది రిటైల్ పరిశ్రమలో యువ ఔత్సాహికులకు సమగ్ర నైపుణ్యాభివృద్ధి అవకాశాలను అందిస్తుందన్నారు. మంగళవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లా రెడ్డి, టాస్క్ సిఇఒ శ్రీకాంత్ సిన్హా, తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్యం(ఐఅండ్సి), ఐటి శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, రత్నదీప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యష్ అగర్వాల్ ల సమక్షంలో ఈ ఎంవోయూ మార్పిడి జరిగింది. యష్ అగర్వాల్ మాట్లాడుతూ దీని స్థాపన రిటైల్ పరిశ్రమలో ప్రతిభను పెంపొందించడం, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించి రిటైల్ పరిశ్రమలో విలువైన నైపుణ్య శిక్షణను అందించనున్నట్లు తెలిపారు. ఒక సంవత్సర కాలంలోనే 10 వేల మంది రిటైల్ రంగంలో వారి భవిష్యత్తును విజయవంతంగా తీర్చిదిద్దుకునే విధంగా వారికి తగిన నైపుణ్యాన్ని విజ్ఞానాన్ని అందించడమే లక్ష్యం అన్నారు.




