దాంతోనే ఉద్యమం మరింత ముందుకు
జయంతి సందర్భంగా సిఎం సహా రాష్ట్ర వ్యాప్తంగా సార్కు ఘన నివాళి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21 : తెలంగాణ కోసం జరిగిన మహోద్యమంలో ఆచార్య జయశంకర్ ఆద్యంతం అందరికీ స్ఫూర్తిగా నిలిచారని సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం జయశంకర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనను స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. సమైక్య ఆంధప్రదేశ్ ఏర్పడిన సమయంలోనే తెలంగాణ ప్రాంతానికి జరగనున్న అన్యాయంపై ఆచార్య జయశంకర్ మాట్లాడారని చెప్పారు.
జీవితాంతం తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం, వివక్షపై తెలంగాణ ప్రజలను జాగృతం చేశారన్నారు. జయశంకర్ సార్ ఉద్యమ స్ఫూర్తితోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయార్ రావు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు.
ఇప్పుడు జయశంకర్ సర్ ఉంటే తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి సీఎం కేసీఆర్ను అభినందించే వారన్నారు. ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ కలలుగన్న తెలంగాణ సాధనే లక్ష్యంగా సిఎం కెసిఆర్ పనిచేస్తున్నానని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. కుల వృత్తుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి సందర్భంగా వరంగల్లో ఆచార్య జయశంకర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ భవన్ లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాధన కోసం జయశంకర్ సార్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సార్ చూపిన బాటలో పయనిస్తామన్నారు.




