- సికింద్రాబాద్ ఘటన కుట్రలో భాగమే
- రాష్ట్ర బిజెపి చీఫ్ బండి సంజయ్
- బండి బాసర పర్యటనను కామారెడ్డి వద్ద అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలో కుట్ర ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఆర్మీ విద్యార్థులకు ఈ సమస్యతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. టీఆర్ఎస్,ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఈ విధ్వంసానికి పాల్పడ్డాయని ఆరోపించారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదని ప్లాన్ ప్రకారమే జరిగిందని అన్నారు. ఇంత జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందని ప్రశ్నించారు.
ఆర్మీ విద్యార్ధులకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయదని, అటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ కాదని అన్నారు. కొంతమంది తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, వారి మాటలు వినొద్దని సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతాలు క్షీణించాయని, ప్రభుత్వమే విద్వాంసాలను పెంచిపోషిస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహిరిస్తుందని సంజయ్ ఫైర్ అయ్యారు.
బండి బాసర పర్యటనను కామారెడ్డి వద్ద అడ్డుకున్న పోలీసులు
బాసర ట్రిపుల్ ఐటీకి భారీ కాన్వాయ్తో బయల్దేరిన బండి సంజయ్ను కామారెడ్డి జిల్లా బిక్కనూర్ టోల్ గేట్ వద్దకు బండి సంజయ్ చేరుకోగా… పోలీసులు అడ్డుకున్నారు. బండి సంజయ్ను బాసరకు పంపించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు తోపులాట జరిగింది. భాజపా నేతలు రోడ్డుపై నిరసన తెలుపుతుండగా.. వారిని పోలీసులు అరెస్టు చేశారు.




