న్యూ దిల్లీ, డిసెంబర్ 19 : టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చడంపై దిల్లీ హైకోర్టులో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్కు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును సంప్రదించారు. బంగారు కూలి పేరుతో టీఆర్ఎస్ నిధులు సమకూర్చుకోవడానికి సంబంధించి ఈసీకి రేవంత్ గతంలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపాల్సిందిగా ఆదాయపు పన్ను శాఖకు అప్పట్లో ఈసీ లేఖ రాసింది. టీఆర్ఎస్ నిధుల కూర్పు అంశంపై విచారణ పూర్తి కాకముందే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చేందుకు ఈసీ అనుమతి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రేవంత్ దిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. రేవంత్ పిటిషన్పై ఇవాళ దిల్లీ హైకోర్టులో విచారణ జరిగే అవకాశముందని తెలుస్తుంది. ఐటీ విచారణ పూర్తి కాకముందే ఎలా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకునేందుకు అనుమతి ఇస్తారంటూ తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ నెలలో బీఆర్ఎస్కు ఈసీ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్కు ఈసీ లేఖ పంపింది. ఈ లేఖపై సంతకం చేసి ఈసీకి కేసీఆర్ రిప్లై ఇచ్చారు. దీంతో టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్గా మారింది. బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను తెలంగాణ భవన్లో పార్టీ నేతల సమక్షంలో కేసీఆర్ ఘనంగా నిర్వహించారు. గతంలోని వ్యవహారాన్ని రేవంత్ ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం కీలకంగా మారింది. పార్టీ పేరు నుంచి తెలంగాణను తీసేయడం వల్ల తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ మారిపోయారని రేవంత్ ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రజలను వదిలేసి దేశ రాజకీయాలను మార్చేస్తానంటూ కేసీఆర్ డ్రామాలాడుతున్నారని విమర్శించారు.




