ఛత్తీస్‌ఘఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

  • 8 మంది మావోయిస్టులు మృతి..ఒక జవాన్‌ మృతి, మరో ఇద్దరికి గాయాలు
  • అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్న భద్రతా బలగాలు

భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్‌ 15 : ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా నారాయణ్‌పూర్‌ జిల్లాలోని అబూజ్‌మడ్‌ అడవుల్లో శనివారం నాడు భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఒక జవాన్‌ మృతి చెందగా మరో ఇద్దరు జవాన్‌లకు తీవ్ర గాయలయ్యాయి. వీరిని మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్‌కి తరలించారు. అటవీ ప్రాంతంలో పారిపోయిన మావోయిస్టుల కోసం భద్రతాబలగాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి.
మృతుల స్న్యం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ప్రతీరోజు ప్రత్యేక ఆపరేషన్‌లు నిర్వహిస్తున్నాయి. అబూజ్‌మడ్‌ అడవులే టార్గెట్‌గా భద్రతా బగాలు మావోయిస్టుల కోసం జల్లెడపడుతున్నాయి. గడిచిన ఆరు నెలల పాటు మావోయిస్టులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఏప్రిల్‌ 16వ తేదీన కాంకేర్‌ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మృతి చెందగా గర్చోలి ఎన్‌కౌంటర్‌లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే మే 11 వ తేదీన బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. శనివారం నారాయణ్‌పూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. వరుస ఎన్‌కౌంటర్‌లతో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లుతుంది.
మావోయిస్టుల కుట్రను విఫలం చేసిన ములుగు పోలీసులు : ములుగు ఎస్పీ శబరీష్‌
మావోయిస్టులు పోలీసులే లక్ష్యంగా చేసిన కుట్రను ములుగు పోలీసులు విఫలం చేసినట్లు ములుగు ఎస్పీ శబరీష్‌ తెలిపారు. మందుపాతర అమరుస్తుండగా డిప్యూటి దళ కమాండర్‌, ఇద్దరు దళ సభ్యులతో సహా ముగ్గురు మిలీషియా సభ్యులను అరెస్టు చేసినట్లు తెలిపారు. తెలంగాణ, ఛత్తీస్‌ఘఢ్‌ సరిహద్దుల్లో గల వెంకటాపురం మండలం అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు మహిళలు, నలుగురు మగ మిలీషియా సభ్యులను పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు.
వారి వద్ద నుండి ఒక డిపిబిఎల్‌ తుపాకి, నాలుగు కిట్‌ బ్యాగులు, రెండు వాకీటాకీలతో పాటు భారీగా పేలుగు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన వారిలో వాజేడు, వెంకటాపురం దళ డిప్యూటి కమాండర్‌ కారం భుద్రి, పామేడు ఏరియా కమిటి సభ్యులు సోడి పోశి బెటాలియన్‌ సభ్యుడు సోడి విజయ్‌, మిలీషియా సభ్యుడు కుడం తస్రు, మరో మిలీషియా సభ్యుడు సోడి ఉర్ర మడకం భీమాలను అరెస్టు చేసినట్లు ఎస్పీ శబరీష్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *