పటాన్ చెరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 18: వివిధ గ్రామాల మధ్య ఇంటర్ లింక్ రోడ్ల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్ చెరు మండలం ఇంద్రేశం చౌరస్తా నుండి బచ్చు గూడెం, చిట్కుల్ మీదుగా ఇస్నాపూర్ జాతీయ రహదారి వరకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా నాలుగు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలతో నిర్మిస్తున్న బిటి రోడ్డురెన్యువల్ పనులను శుక్రవారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఇస్నాపూర్ చౌరస్తా నుండి వయా నందిగామ, క్యాసారం గ్రామం వరకు ఎన్ఆర్ అర్ డిఎ ద్వారా 6 కోట్ల 58 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రోడ్డు నిర్వహణ పనితీరును పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో గత తొమ్మిది సంవత్సరాల కాలంలో 20కి పైగా బ్రిడ్జిలు నిర్మించడంతోపాటు,. గ్రామాల మధ్య అంతర్గత రహదారులను నిర్మించడం జరిగిందని తెలిపారు. దీని మూలంగా మారుమూల గ్రామాల సైతం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లడంతో పాటు ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ఈఈ జగదీశ్వర్, ఎంపీడీవో బన్సీలాల్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, నందిగామ సర్పంచ్ ఉమావతి గోపాల్, ఎంపీటీసీలు నాగజ్యోతి లక్ష్మణ్, మాధవి నరేందర్ రెడ్డి, చిట్కుల్ ఉపసర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, దశరథ్ రెడ్డి, డిఈ సురేష్, తదితరులు పాల్గొన్నారు.




