- ముగిసిన ఎన్నికల ప్రక్రియ
- 8న కౌంటింగ్తో తేలనున్న భవితవ్యం
గాంధీనగర్, డిసెంబర్ 5 : గుజరాత్ ఎన్నికల ప్రక్రియ దాదాపు ముగిసినట్లే. సోమవారం రెండో విడత ఓటింగ్ సాగింది. 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల్లో గెలుపుపై బిజెపి గతంలోకన్నా మరింతగా ధీమాగా ఉంది. ఆప్ కూడా అంతే ధీమాగా ఉంది. ఈసారి అనూహ్యంగా ఆప్ ఎన్నికల్లో దూసుకుని వచ్చింది. గుజరాత్ లోని 14 జిల్లాల పరిధిలో ఉన్న 93 అసెంబ్లీ సీట్లకు చివరి విడత పోలింగ్ జరుగుతుండగా… 833 మంది పోటీలో నిలిచారు. కాగా 2.51 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించు కున్నారు. అంతకు మునుపు యువ ఓటర్లు, మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని ప్రధాని మోడీ ఒక ట్వీట్లో కోరారు. కాగా డిసెంబర్ 1న జరిగిన తొలి దశ పోలింగ్లో మొత్తం 63.14 శాతం పోలింగ్ నమోదైంది.
డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. దాదాపు మూడు దశాబ్దాలుగా గుజరాత్ను ఏలుతోన్న బీజేపీ మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తుండగా ఆ పార్టీని గద్దె దించాలని కాంగ్రెస్, ఆప్ భావిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా గుజరాత్లో ప్రచారం వేడెక్కి, రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. విమర్శలకు పదను పెట్టారు. ప్రధాని మోడీ గుజరాత్ ఎన్నికల విషయంలో పట్టుదలగా ఉండడం, కాంగ్రెస్,ఆప్లు ఈసారి జోరుగా ప్రచారం నిర్వహించడంతో ఫలితం ఎవరివైపు అన్న ఉత్కంఠ సహజంగానే ఏర్పడింది. గుజరాత్ గతంలో ఎన్నడూ లేనంతగా వేడెక్కింది. ఇక్కడి ప్రచారం కార్యక్రమాలు, అభివృద్దిపై కాకుండా వ్యక్తిగత దూషణలకు, విమర్శలకు కేంద్ర బిందువుగా మారింది. విలువలు జారిపోతున్నాయనడానికి గుజరాత్ ప్రచారంలో సాగిన తీరే నిదర్శనం.
ఎన్నికల సమయంలో నాయకుల మాటతీరు పరస్పర విమర్శలకు దారితీసింది. దిగజారుడు వ్యాఖ్యలు చేయడం ద్వారా హుందాతనం కోల్పోయారు. గుజరాత్లో కాంగ్రెస్, బీజేపీ ప్రచారంలోకి ఊహించని అంశాలు చోటు చేసుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో అభివృద్ది గురించి మాట్లాడి, అందుకు గుజరాత్ను నిదర్శనంగా చూపి దేశాధికారాన్ని దక్కించుకున్న నరేంద్ర మోదీ ఎందుకో గానీ ఇప్పుడు స్వరాష్ట్రంలో అభివృద్దిని పక్కన పెట్టి సెంటిమెంట్ ప్రయోగించారు. గుజరాత్ ఎన్నికలు ప్రధానంగా కులం, మతం, కుట్రల చుట్టూ తిరిగాయి. ఈ ఎన్నికల్లో కూడా మరోమారు బిజెపికి విజయం ఖాయమని డియా సర్వేలు, బెట్టింగ్ బాబులు మొత్తుకుంటున్నాయి.
సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మరోమారు తెరపైకి వచ్చారు. నర్మదా బచావో అధ్యక్షురాలు మేథాపాట్కర్ను రాహుల్ వెంటేసుకుని రావడం కూడా విమర్శలకు దారితీసింది. ప్రధాని గుజరాతీ సెంటింమెంట్ను బాగా ఉపయోగించారు. కాంగ్రెస్లో పోటాపోటీగా తనపై విమర్శలకు క్యూ కట్టారని కూడా అన్నారు. కులమత ప్రాతిపదికన సమాజాన్ని విభజించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ అంటే ఏమిటో గుజరాత్ ప్రజలకు బాగా తెలుసు.
ఇక విపక్షాలు కూడా బాల్కినోబానో కేసును బాగానే ఉపయోగించు కున్నారు. ఇదే సందర్భంలో జాతీయవాదం, మానవతావాదం తమను నడిపిస్తున్నాయని మోడీ చెప్పారు. ఈ ఎన్నికల్లో విలువల గురించి ప్రస్తావన లేకుండా పోయింది. అభివృద్ది మంత్రం, తన పాలనను పక్కన పెట్టారు. కాంగ్రెస్ను దాని వారసత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా ప్రచాం చేసారు.



