కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల 18 నెలల డీఏ బకాయిల నిలిపివేత

రాజ్య సభలో స్పష్టం చేసిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి
న్యూ దిల్లీ, డిసెబర్‌ 14 : ‌కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. కీలక ప్రటకన చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా డియర్‌నెస్‌ అలవెన్స్‌పై ఎంతో కాలంగా నెలకొన్న అంచనాలను పటాపంచలు చేసింది. 18 నెలల డియర్‌నెస్‌ అలవెన్స్ ‌బకాయిలను చెల్లించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అంటే ఉద్యోగులకు ఇక ఈ డీఏ రానే రాదు. కరోనా వైరస్‌ ‌సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డియర్‌నెస్‌ అలవెన్స్‌ను నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు కరోనా టైమ్‌లో పెండింగ్‌లో ఉన్న డియర్‌నెస్‌ అలవెన్స్‌ను చెల్లించే ప్రసక్తి లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ కుండబద్దలు కొట్టేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది బ్యాడ్‌ ‌న్యూస్‌ అని చెప్పుకోవాలి. 2020 జనవరి 1 నుంచి 2021 జూన్‌ 30 ‌వరకు డియర్‌నెస్‌ అలవెన్స్ అనేది ఉద్యోగులకు పెండింగ్‌లో ఉంది.

కరోనా కారణంగా ప్రభుత్వం డీఏను నిలుపుదల చేసింది. పరిస్తితులు మళ్లీ గాడిలో పడిన తర్వాత ఈ డీఏ బకాయిలు అందుతాయని ఉద్యోగులు భావించారు. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ అంశంపై క్లారిటీ ఇచ్చేసింది. ఉద్యోగులకు ఈ 18 నెలల డీఏ బకాయిలను చెల్లించేది లేదని స్పష్టం చేసింది. నరేన్‌ ‌భాయ్‌ ‌జే రావత్‌ ‌రాజ్య సభలో డీఏ బకాయిలపై కేంద్రాన్ని ప్రశ్నించారు. 18 నెలల డీఏ బకాయిలను ఉద్యోగులకు చెల్లిస్తుందా? లేదా? అని ప్రశ్న లెవనెత్తారు. దీనికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ ‌చౌదరీ సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 18 నెలల డియర్‌నెస్‌ అలవెన్స్ ‌బకాయిలను చెల్లించాలనే ప్రతిపాదనలు తమ వద్దకు వచ్చాయని తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరం తర్వాత కూడా పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆయన తెలిపారు. అందువల్ల డియర్‌నెస్‌ అలవెన్స్ ‌బకాయిలను చెల్లించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం చూస్తే.. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు డియర్‌నెస్‌ అలవెన్స్‌ను పెంచాల్సి ఉంటుంది. ఆరు నెలలకు ఒకసారి డీఏ పెరుగుదల ఉంటుంది. అందుకే ప్రభుత్వం కూడా ఏడారికి రెండు సార్లు ఆరు నెలల చొప్పున డీఏను పెంచుకుంటూ వెళ్తోంది. అయితే కరోనా టైమ్‌లో మాత్రం డియర్‌నెస్‌ అలవెన్స్ ‌పెరగలేదు. మూడు సార్లు స్థిరంగానే కొనసాగింది. అందుకే ఉద్యోగులు ఈ మూడు సార్లు పెంపును(18 నెలలు) బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. అయితే ఇప్పుడు కేంద్రం ఈ విషయంపై స్ఫష్టత ఇచ్చేసింది. ఇక ఈ డీఏ బకాయిలు ఉద్యోగులకు రావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *