సిఎం తరఫున దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానం అందచేత
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 31 : మాజీ సీఎం కెసిఆర్ను ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ కలిశారు. బంజారాహిల్స్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన వేణుగోపాల్..జూన్ 2 జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో పాల్గొనాలని ప్రభుత్వం తరపున ఆహ్వానించారు. సిఎం రేవంత్ ఆదేశాలతో వేణుగోపాల్ వెళ్లి ఆహ్వాన పత్రికను అందచేశారు. ఉత్సవాల్లో పాల్గొనాలని విన్నవించారు. కాగా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అన్ని ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ మాట్లాడుతూ.. తెలంగాణ అవరణలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ప్రభుత్వం తరపున ఆహ్వాన లేఖను కేసీఆర్కు అందజేశామని అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు తెలంగాణ ఉద్యమ కారులను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపారు. గురువారం (మే 30) సచివాలయంలో వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు, ఉద్యమకారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్ర అవతరణ వేడుకలు, రాష్ట్రగీతం,రాజముద్రపై చర్చించారు. రాష్ట్రఅవతరణ వేడుకల్లోనే రాష్ట్ర గీతం విడుదల చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర రాజముద్రపై ఇంకా చర్చలు జరుపుతున్నందున ఆవిష్కరణను వాయిదా వేశారు.





