కృష్ణా జలాలపై దమ్ముంటే చర్చకు రావాలి
కెసిఆర్కు మంత్రి ఉత్తమ్ సవాల్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : కాళేశ్వరంతో తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ సర్వనాశనం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం నాడు సచివాలయంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ… పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 14 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు ఒక్క స్థానం కూడా రాదని చెప్పారు. నల్గొండలో సభ పెట్టడం కాదని.. కృష్ణా జలాలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.
కేసీఆర్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ఏపీ సీఎం జగన్తో ఎందుకు ఏకాంత చర్చలు జరిపారని నిలదీశారు. కేసీఆర్, జగన్ కలిసి తెలంగాణపై కుట్ర చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ వల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం కలిగిందని తెలిపారు. కాసుల కక్కుర్తితో కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు.



