రాహుల్ సమక్షంలో కండువా కప్పిన ఖర్గే
కాంగ్రెస్ అతిపెద్ద సెక్యులర్ పార్టీ అన్న షర్మిల
పార్టీ ఆదేశిస్తే..అండమాన్ వెళ్లమన్నా వెళతా
తండ్రి వైఎస్ అడుగుజాడల్లో నడుస్తానని ప్రకటన
రాహుల్ను ప్రధానిగా చూడాలన్నదే కోరిక
న్యూ దిల్లీ,ప్రజాతంత్ర,జనవరి4: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం ఉదయం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీల సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. షర్మిల చేరికతో కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనం అయ్యింది. ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు, పలువురు నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్లో షర్మిల చేరికతో గత కొద్దిరోజులుగా వొస్తున్న వార్తలకు తెరబడిరది.కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని, కాంగ్రెస్లో వైఎస్సార్టీపీని విలీనం చేశామని షర్మిల అన్నారు. కాంగ్రెపార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిబద్ధతో పనిచేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్ప నేత అని అన్నారు. ఆయన ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశ లూ శ్రమించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని అన్నారు. అన్ని వర్గాలను కలుపుకుంటూ, అందరినీ కలుపుతూ పని చేస్తుందన్నారు. ఒక క్రిస్టియన్గా మణిపూర్లో చర్చిల కూల్చివేత తనను తీవ్రంగా బాధించిందన్నారు. సెక్యులర్ పార్టీ అధికారంలో లేకపోతే ఏం జరుగు తుందనడానికి ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీపై నమ్మకాన్ని తనతో పాటు ప్రజలందరిలో పెంచిందన్నారు. తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక వోటు చీలకూడదన్న ఉద్దేశంతో కాంగ్రెస్కు మద్దతు ప్రకటించి పోటీ చేయలేదని వెల్లడిరచారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నది తన తండ్రి వైఎస్సార్ ఆశయమని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. గతరాత్రి భర్త అనిల్తో కలిసి షర్మిల దిల్లీ చేరుకున్నారు. గురువారం ఉదయం షర్మిలతో పాటు ఏపీ కాంగ్రెస్ నేతలు, షర్మిల అనుచరులు ఏఐసీసీ కార్యాలయానికి వొచ్చారు. ఇదిలావుంటే కాంగ్రెస్లో చేరిన షర్మిలకు ఆంధ్ర పీసీసీ పగ్గాలు అప్పగించేందుకే రాహుల్ మొగ్గు చూపుతున్నారు. ఇటీవల దిల్ల్లీలో రాష్ట్ర నేతలతో జరిగిన సమావేశంలో.. ఆయన, మల్లికార్జున ఖర్గే ప్రత్యేకంగా షర్మిల ప్రస్తావన తీసుకొచ్చారు. రాష్టాన్రికి చెందిన ఇద్దరు మాజీ ఎంపీలు తప్ప ఆమె రాకను అందరూ స్వాగతించారు. పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుండగా.. రాహుల్ జోక్యం చేసుకుని.. రాష్ట్ర కాంగ్రెస్లో షర్మిలకు ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనం కోసం కాంగ్రెస్ పార్టీలో పని చేస్తానని వైఎస్ షర్మిల తెలిపారు. . కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉంది. దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్. అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత హస్తం పార్టీది. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉంది. వైఎస్ జీవితాంతం కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశారు. నేను వైఎస్ అడుగుజాడల్లో నడుస్తాను.’ అని షర్మిల పేర్కొన్నారు. ఇవాళ్టి నుంచి కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ ఓ భాగమని, కార్యకర్తలు, నేతలు, అభిమానులు కాంగ్రెస్ పార్టీ లక్ష్యాల మేరకు పని చేస్తారని చెప్పారు. ’మణిపూర్ లో హింస చాలా బాధ కలిగించింది. ఈ పరిస్థితులు మారాలంటే దేశంలో సెక్యులర్ పార్టీ అధికారంలోకి రావాలి. వైఎస్ జీవితాంతం కాంగ్రెస్ పార్టీ కోసమే కష్టపడి పని చేశారు. మా నాన్న అడుగుజాడల్లోనే నేనూ నడుస్తాను. కేసీఆర్ వ్యతిరేక వోటు చీలకూడదనే తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నాం. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నది మా నాన్న కల. అది నెరవేర్చడానికి మనస్ఫూర్తిగా పనిచేస్తాను. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నా శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. అధిష్టానం ఆదేశిస్తే ఏపీలోనే కాదు అండమాన్ లో పని చేయడానికైనా సిద్ధం.’ అంటూ షర్మిల వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిన నేపథ్యంలో ఆమెకు అప్పగించే బాధ్యతలపై ఆసక్తి నెలకొంది. ఏఐసీసీలో పదవి ఇస్తారా. లేదా ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారా.? అనేది తెలియాల్సి ఉంది. అయితే, షర్మిలకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ పగ్గాలు అప్పగించేందుకు రాహుల్ మొగ్గు చూపుతున్నారని సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్లో షర్మిలకు ప్రాధాన్యం ఉంటుందని రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆమెకు ఏపీ పగ్గాలు అప్పగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ, అదే జరిగితే ఏపీలో అన్నాచెల్లెళ్ల మధ్య రాజకీయం మరింత ఆసక్తిగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పట్లో, వైసీపీ తరఫున ఆమె పాదయాత్ర చేసి తన అన్న జగన్ కు అండగా నిలిచారు. అనంతరం తెలంగాణలో పార్టీని స్థాపించి ఇప్పుడు కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఈ క్రమంలో రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనేది అందరిలోనూ ఆసక్తిగా మారింది.




