బీఆర్ఎస్ను ఎదుర్కునేందుకు ఉమ్మడి వ్యూహంపై చర్చ
కరీంనగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 20 : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్ భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం కరీంనగర్ వీపార్క్ హోటల్కు చేరుకున్న కోదండరామ్ రాహుల్తో సమావేశమయ్యారు. కాంగ్రెస్తో కలిసి పనిచేయాలని ప్రొఫెసర్ను రాహుల్ కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కోదండరామ్ను రాహుల్ కోరగా..పోటీకి ఆసక్తి లేదని ప్రొఫెసర్ కోదండరామ్ తేల్చి చెప్పారు.
ఎన్నికల్లో అవగాహన, బీఆర్ఎస్ను ఎదుర్కునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. తెలంగాణ ప్రయోజనల కోసం, రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాలని కోదండరామ్ అన్నారు. కేసీఆర్ నియంత పాలన దించడానికే టీజేఎస్ ఏర్పడిందని కోదండరామ్ వెల్లడించారు. ఈ భేటీలో కేసీ వేణు గోపాల్, రేవంత్ రెడ్డి, జన సమితి నాయకులు, ప్రొ. పీఎల్ విశ్వేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.




