న్యూ దిల్లీ, డిసెంబర్ 28 : భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పార్టీ ఆఫీస్ బేరర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతంత్య్ర పోరాటం, సేవ, త్యాగం, అనే నినాదంతో 137 ఏళ్ల క్రితం ప్రారంభమైన కాంగ్రెస్ ప్రయాణం నిరంతరం కొనసాగుతోంది. కాంగ్రెస్ తన ఆశయాలు, లక్ష్యాలకు కట్టుబడి ఉందని మల్లికార్జున ఖర్గే అన్నారు. కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన మోడీ సర్కార్ తీరుపై మండిపడ్డారు.
గంగా జమున సంస్కతిని రూపుమాపే కుట్ర జరుగుతోందన్నారు. దేశంలో సాధారణ పౌరుడు అభద్రతా భావంలో ఉన్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పక్కదారి పట్టిస్తున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ మౌనంగా ఉండబోదన్నారు. ఎంతో ఉన్నతమైన లక్ష్యంతో ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ ప్రయాణం.. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదర్శాలు, విలువలు, సూత్రాలకు.. మరోసారి తమల్ని తాము పునరంకితం చేసుకుంటామన్నారు.



