సిమ్లా, నవంబర్ 4 : కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రకటించారు. ఏ వాగ్దానం చేసినా దానిని నెరవేరుస్తామన్నారు. రాష్ట్రంలో ప్రియాంక గాంధీ పర్యటించారు. కాంగ్రా జిల్లాలోని నగ్రోటా బగ్వాన్లో నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఛత్తీస్గఢ్లో రైతు రుణమాఫీకి హావి• ఇచ్చి అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తొలుత కాంగ్రాలోని జ్వాలాదేవి ఆలయంలో ప్రియాంక ప్రార్థనలు చేశారు.ఆమెతో పాటు ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘెల్ కూడా ఉన్నారు. త్వరలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 12న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రియాంక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఉనికిని చాటు కోవడానికి ప్రయత్నిస్తోంది. 68 అసెంబ్లీ స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబరు 12న ఒకే దశలో ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 8వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.




