- కోచింగ్ క్యాపిటల్ కోటాలో కోచింగ్ విద్యార్థులతో రాహుల్
- రాజస్థాన్లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, డిసెంబర్ 8 : కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, ఎంపి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గురువారం రాజస్థాన్ రాష్ట్రంలో కోచింగ్ క్యాపిటల్గా పేరొందిన కోటాకు చేరుకుంది. కోటాలో సిటీ మాల్ ముందు నుంచి యాత్ర కొనసాగుతున్న సందర్భంగా అక్కడ వేలాదిగా గుమిగూడిన కోచింగ్ విద్యార్థులను చూచి ఆగిన రాహుల్ గాంధీ కాసేపు వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి భారత్ భవిష్యత్తు మీరే అంటూ.. ‘ఐ లవ్ యు’..‘ఐ ప్రౌడ్ యు’ అన్నారు. అయితే కోటా జిల్లాలో యాత్రలో ఒక దుస్సంఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడు రాహుల్కు అతి సమీపంలోకి చేరుకుని పైన పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నం చేయబోగా అక్కడే ఉన్న సాటి యాత్రికులు, భద్రతా సిబ్బంది వెంటనే మంటలార్పి అతన్ని రక్షించారు.
హఠాత్తుగా చోటు చేసుకున్న ఈ సంఘటన యాత్రలో కొద్దిసేపు తోటి యాత్రికులను, భద్రతా సిబ్బందిని కొంత ఆందోళనకు గురి చేసింది. పోలీసులు యువకుణ్ణి అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కాగా రాహుల్ వెంట రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్, రాష్ట్ర పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు వేలాదిగా పాదయాత్రలో పాల్గొన్నారు. కాగా బుండీలో అతి వృద్ధుడైన ఒక అభిమాని రాహుల్తో కలిసి పాదయాత్రలో పాల్గొనడం పలువురి దృష్టిని ఆకర్షించింది.




