న్యూ దిల్లీ, డిసెంబర్ 27 : విమానాశ్రయాల్లో భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉంటుందో అందరికీ తెలుసు. ఏ చిన్న వస్తువునైనా చెక్ చేస్తారు. స్కాన్ చేసి బ్యాగ్ లో అన్ని వస్తువులు పక్కాగా ఉంటేనే వాటిని ప్రయాణానికి అనుమతిస్తారు. అయితే ఇది ఎంతో ప్రయాసతో కూడిన వ్యవహారం. ఈ క్రమంలో ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ చెక్ కోసం బీసీఏఎస్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ 3డీ స్కానర్స్ టెక్నాలజీని కొత్తగా అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల ప్రయాణికుల సమయం ఆదా అవడంతో పాటు సిబ్బందికి పని సులువవుతుంది. కొత్త టెక్నాలజీ రాకతో ఇకపై బ్యాగ్స్ నుంచి ఎలక్టాన్రిక్ పరికరాలు తీసి సిబ్బందికి చూపించాల్సిన అవసరం ఉండదు.
కంప్యూటర్ టోమోగ్రఫీ టెక్నాలజీ ద్వారా ఈ పక్రియ పూర్తవుతుంది. సెన్సర్లు బ్యాగ్ లోని వస్తువులను 3డీ ఇమేజ్ లో చూపిస్తాయి. దీంతో బ్యాగ్ లో ఏముందో ఈజీగా కనిపెట్టొచ్చు. ఇటీవల ఎయిర్ పోర్టుల్లో రద్దీ పెరగడంతో చెకిన్ ఆలస్యమవుతోంది. దీనిపై ఫిర్యాదులు ఎక్కువవుతుండటంతో బీసీఏఎస్ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది.



