ఎయిర్‌ ఇం‌డియా విమానంలో అమానుషం

  • మహిళా ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన
  • చర్యకు సిఫారసు చేసిన అధికారులు
  • ఆలస్యంగా వెలుగలోకి వచ్చిన ఘటన

న్యూదిల్లీ, జనవరి 4 :  ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ, తాను సంస్కారహీనుడినని ఓ విమాన ప్రయాణికుడు రుజువు చేసుకున్నాడు. మద్యం మత్తులో ఉండి, బిజినెస్‌ ‌క్లాస్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై మూత్ర విసర్జన చేసి అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. దీంతో ఎయిరిండియా ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆయనను ’నో ఫ్లై జాబితాలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సంఘటన నవంబరు 26న జరిగినట్లు ఎయిరిండియా అధికారిని ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ తెలిపింది. న్యూయార్క్ ‌నుంచి న్యూఢిల్లీ బయల్దేరిన విమానంలో ఈ దారుణం జరిగింది.

ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ప్రయాణికుడిపై పోలీసులకు ఎయిరిండియా ఫిర్యాదు చేసింది. ఆయనను ’నో ఫ్లైల జాబితాలో పెట్టాలని సిఫారసు చేసింది. దీనిపై ప్రభుత్వ కమిటీ నిర్ణయం తీసుకోవలసి ఉంది. బాధితురాలు తన భయానక అనుభవాన్ని వివరిస్తూ టాటా గ్రూప్‌ ‌చైర్మన్‌ ఎన్‌ ‌చంద్రశేఖరన్‌కు లేఖ రాశారు. భోజనం తర్వాత లైట్లను ఆర్పేశారని, ఆ సమయంలో నిందితుడు తన వద్దకు వచ్చి, ప్యాంట్‌ ‌జిప్‌ ‌విప్పి, తనపై మూత్ర విసర్జన చేశాడని తెలిపారు. అతను పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడని పేర్కొన్నారు. మూత్ర విసర్జన పూర్తయిన తర్వాత అతను తన మర్మాంగాలను బయటకు చూపించడం కొనసాగించినట్లు తెలిపారు. అతను కదలకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోమని అతనిని మిగిలిన ప్రయాణికులు మందలించారని తెలిపారు.

అప్పుడు మాత్రమే అతను అక్కడి నుంచి కదిలాడని చెప్పారు. అతను మూత్ర విసర్జన చేయడంతో తాను ధరించిన వస్త్రాలు, షూస్‌, ‌బ్యాగ్‌ ‌తడిసిపోయాయని పేర్కొన్నారు. అనంతరం విమానం సిబ్బంది తనకు మరొక దుస్తుల జతను ఇచ్చారని, సీటుపై వేరొక షీట్స్ ‌వేశారని చెప్పారు. ఆ వ్యక్తి ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఎలాంటి అడ్డంకులు లేకుండా, స్వేచ్ఛగా వెళ్ళిపోయాడని ఈ లేఖలో పేర్కొన్నారు. చాలా సున్నితమైన, భయానకమైన పరిస్థితిని చక్కదిద్దడంలో సిబ్బంది చురుగ్గా వ్యవహరించలేదని తెలిపారు. ఈ లేఖను ఓ డియా సంస్థ బయటపెట్టడంతో ఈ దారుణం గురించి అందరికీ తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *