- బిఆర్ఎస్ సెంచరీతో విజయం సాధిస్తుంది
- దిమ్మతిరిగేలా బిఆర్ఎస్ మేనిఫెస్టో రాబోతుంది
- మంచిర్యాల పర్యటనలో మంత్రి హరీష్ రావు
మంచిర్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్ 7 : బీఆర్ఎస్ పార్టీ ప్రకటించబోయే మేనిఫెస్టోతో ప్రతిపక్షాలకు దిమ్మ తిరగాల్సిందే అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మంచిర్యాలలో మంత్రి హరీష్ రావు వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెన్షన్లు ఎంత పెంచాలి.. రైతుబంధు ఎంత పెంచాలి..మహిళలకు ఇంకా ఏం చేయాలని సీఎం కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టో రాబోతుంది. ఆ మేనిఫెస్టో వచ్చిందంటే ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవ్వాల్సిందేనని అన్నారు. దిమ్మతిరిగిపోతది. కేసీఆర్ అంటే నమ్మకం, విశ్వాసం. కాంగ్రెసోళ్లు అంటే నయవంచన.. నాటకం. వోట్ల కోసం మాయమాటలు చెబుతున్నారు. కొట్లాడుకునే సంస్కృతి వారిది. ఒక్క మాటలో కాంగ్రెస్ సంస్కృతి చెప్పాలంటే.. మాటలు, మూటలు, ముఠాలు, మంటలు. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అని మంత్రి తెలిపారు.
అరచేతిలో వైకుంఠం చూపించి, కర్ణాటక నుంచి డబ్బులు సంచులు తెచ్చి గెలవాలని కాంగ్రెస్ పగటి కలలు కంటోంది అని హరీష్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ ఉన్నంత కాలం కాంగ్రెస్ ఆటలు సాగవు. కేసీఆర్ హయాంలో కరువు లేదు.. కర్ఫ్యూ లేదు. కరువు, కర్ఫ్యూలు లేకుండా ప్రశాంతంగా పరిపాలన సాగుతుంది. నక్సలైట్లతో చర్చలు జరపుతామని చెప్పి వారిని మట్టుబెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆరు కిలోల బియ్యం, పగటి పూట కరెంట్ ఇస్తామని, తండాలను గ్రామపంచాయతీలు చేస్తామని చెప్పి మోసం చేశారు. వాళ్లు చేసిందేవి• లేదు. కేసీఆర్ దిల్లీని కదిలించి తెలంగాణను సాధించారు.
తెలంగాణ రాకపోతే కల్యాణలక్ష్మి, రైతుబంధు వంటి పథకాలు వచ్చేవా అని హరీష్ రావు అడిగారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రన్ అవుట్ ఖాయం, కేసీఆర్ సెంచరీ కొట్టడం ఖాయమని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. శనివారం చెన్నూరులో బీఆర్ఎస్ భారీ రోడ్ షోలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన వంద సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతోందన్నారు. కర్ణాటక అవినీతి సొమ్ముతో కాంగ్రెస్ ఇక్కడ గెలవాలని అనుకుంటోందన్నారు. రేవంత్ రెడ్డి 10ఏళ్ల పాలనపై చర్చ అంటున్నారు. నీతో కాదు మాజీ ముఖ్య మంత్రులతో చర్చకు సిద్ధం. నాడు సోనియా గాంధీని బలిదేవత అన్న వ్యక్తి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి రేపు ఏ పార్టీలోకి పోతడో తెలువదు. కాంగ్రెస్ అంటేనే మాటలు, ముఠాలు, మంటలు. హైదరాబాద్లో మతం మంటలు పెట్టిన పార్టీ కాంగ్రెస్‘ అంటూ వ్యాఖ్యలు చేశారు. గోదావరి వరదలపై సర్వే చేస్తామని.. అవసరమైతే కర కట్టలు కడతామని.. భూసేకరణ జరిపి రైతులను ఆదుకుంటామని మంత్రి హరీష్రావు పేర్కొన్నారు.





