మేడ్చల్, ప్రజాతంత్ర, అగస్ట్ 24 : ఉద్యోగ నిర్వహణలో తమ విధులను సక్రమంగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో కారుణ్య నియామకాల కింద జిల్లా వ్యాప్తంగా 11 మందికి నియామక పత్రాలను అందచేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ వివిధ శాఖలకు సంబంధించిన కార్యాలయాల్లో పని చేస్తూ మరణించిన వారికి వారి వారసులకు విద్యార్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగంలో నియామకాలు ఉంటాయని తెలిపారు. కారుణ్య నియామకాల కింద జిల్లా వ్యాప్తంగా మొదటి విడుతలో 28 మందికి నియామక పత్రాలు అందచేయగా, నేడు 11 మందికి కారుణ్య నియామకాల కింద నియామకపత్రాలు అందచేయడం జరిగిందన్నారు. నూతనంగా నియామకమైన ఉద్యోగులు తమ ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, కలెక్టరేట్ ఏఓ, రామ్ మోహన్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



