ఉద్దేశ్యపూర్వకంగానే విద్యా రంగం నిర్వీర్యం

  • వినాశకరంగా నూతన విధ్యా విధానాలు
  • అన్ని రంగాల్లోనూ దుర్భర పరిస్థితి
  • దేశ ప్రయోజనాలకు భిన్నంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరి
  • ఎస్‌ఎఫ్‌ఐ 17‌వ జాతీయ మహా సభల సందర్భంగా త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ ‌సర్కార్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : ‌దేశ ప్రయోజనాలకు భిన్నంగా అర్‌ఎస్‌ఎస్‌ ‌చేతుల్లోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ ‌సర్కార్‌ ‌మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని పథకం ప్రకారం ధ్వంసం చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆయన దుయ్యబట్టారు. పేదలకు విద్యను దూరం చేసి.. కార్పొరేట్‌ ‌శక్తులకు కట్టబెడుతుందని, ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బీజేపీ తీసుకువచ్చిన నూతన విద్యా విధానం స్వార్థం, విభజన తత్వాన్ని పెంపొందిస్తుందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లో ఎస్‌ఎఫ్‌ఐ 17‌వ జాతీయ మహా సభల సందర్భంగా మంగళవారం పీపుల్స్ ‌ప్లాజా వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా మాణిక్‌ ‌సర్కార్‌ ‌హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ సమావేశాలు జరుగుతున్నాయని, విద్యారంగం నుంచి మొదలు అన్ని రంగాలు దుర్భర పరిస్థితిని ఎదుర్కుంటున్నాయన్నారు.

నూతన విద్యా విధానం వినాశకరమైందని, విశ్వ విద్యాలయాల్లోకి అర్‌ఎస్‌ఎస్‌ ‌శక్తులు ప్రవేశించి విద్యార్థి సంఘాల నాయకులపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. నూతన విద్యా విధానంపైన సమావేశాల్లో సమగ్రంగా చర్చించాలని, స్వాతంత్ర పోరాట చరిత్రను కేంద్రంలోని బీజేపీ సర్కారు వక్రీకరిస్తుందన్నారు. జాతీయ నూతన విద్యా విధానంకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని, దేశంలో నిరుద్యోగ సమస్య భయంకరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నరేంద్ర మోదీ ఎన్నికలకు ముందే చెప్పారని, నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి ఆరేళ్ల పూర్తి అయ్యిందని, 12 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కనీసం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం లేదని, ఉద్యోగాల భర్తీ విధానాన్నే నరేంద్ర మోదీ ప్రభుత్వం మార్చేసిందన్నారు.

దేశాన్ని కాపాడే సైనికులను కూడా అగ్నిపత్‌ ‌పేరుతో తాత్కాలికంగా తీసుకుంటానంటుందని, విద్యా రంగమే కాదు.. వ్యవసాయ రంగం సంక్షోభం ఎదుర్కొంటుందని ఆయన అన్నారు. సబ్సిడీలు, కనీస మద్దతు ధరలు లేకుండా పోయాయన్న మానిక్‌ ‌సర్కార్‌.. ‌కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. ప్రజల జీవన స్థితగతులే వారిని పోరాటానికి పురిగొలుపుతున్నాయని, హిందూ, ముస్లిం అంటూ మతాల మధ్య చిచ్చుపెట్టి పాలిస్తున్నారన్నారు. కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని, లౌకిక శక్తులు దేశాన్ని కాపాడేందకు ముందుకు రావాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ‌జాతీయ మహాసభలు నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేదుకు శంఖారావాన్ని పూరించాలని ఆయన పిలుపునిచ్చారు. బహిరంగ సభలో ఎస్‌ఎఫ్‌ఐ ‌జాతీయ అధ్యక్ష, ప్రధానకార్యదర్శి వీపి. సాను, మయుక్‌ ‌బిశ్వాస్‌, ‌రాష్ట్ర అధ్యక్ష, కార్యద్శులు ఆర్‌. ఎల్‌. ‌మూర్తి, నాగరాజుతో పాటు.. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఎస్‌ఎఫ్‌ఐ ‌కార్యకర్తలు తరలివచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *