పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 1: మియాపూర్ నుండి పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తా వరకు మెట్రో రైలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల
పటాన్ చెరులో జరిగిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన సభలో నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు మెట్రో రైలు పొడిగించాలని కోరుతూ ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం తొలి క్యాబినెట్ లోనే మెట్రో రైల్ విస్తరణ పనులకు ఆమోదం తెలుపుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలోనే మెట్రో రైల్ విస్తరణ పనులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఎమ్మెల్యే జీఎంఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న పటాన్ చెరు నియోజకవర్గం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు విస్తరణ పనులకు త్వరితగతిన ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. మెట్రో రైలు విస్తరణకు సంపూర్ణ సహకారం అందించిన రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ భూపాల్ రెడ్డిలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా కుర్ర సత్యనారాయణ ఎంపిక పట్ల హర్షం
వర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు కుర్ర సత్యనారాయణ ను ఎంపిక చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఎమ్మెల్యే జీఎంఆర్ హర్షం వ్యక్తం చేశారు. సత్యనారాయణకు ఎమ్మెల్యే జీఎంఆర్ శుభాభినందనలు తెలిపారు.




