- హన్మకొండ ఏసీపీ నర్సింహారావు
- మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థుల సామామూహిక ప్రతిజ్ఞ
వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్టు 13: మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞలు చేయడం ద్వారా కిట్స్ వరంగల్ ఇతర కళాశాలలకు ప్రేరణగా నిలిచిందని హనుమకొండ ఏసీపీ పి.నర్సింహారావు పేర్కొన్నారు. కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ (కిట్స్డబ్ల్యు) రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్, కిట్స్ వరంగల్ ఎన్ఎస్ఎస్ యూనిట్ సహకారంతో విద్యార్థుల కోసం మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన ప్రచారాన్ని కిట్స్ వరంగల్ క్యాంపస్లోని సిల్వర్ జూబ్లీ సెమినార్ హాల్ అండ్ సివిల్ సెమినార్ హాల్ వేదికలపై రెండు సెషన్లను నిర్వహించినట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏసీపీ నర్సింహారావు మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. యువత ఎదగడానికి మంచి అభిరుచి కలిగి ఉండాలన్నారు. యువత మాదకద్రవ్యాలు లేదా మద్యానికి బానిస కాకుండా ఉత్తమ పద్ధతులను పాటించాలన్నారు. కిట్స్ వరంగల్లో మాదకద్రవ్య రహిత క్యాంపస్ను నిర్వహించడం ముదావహమని ఆయన ప్రశంసించారు. విద్యార్థికి సామాజిక జీవనం, యవ్వనం, క్రమశిక్షణ, శారీరక శ్రేయస్సు అత్యంత ముఖ్యమన్నారు. తెలంగాణ ప్రభుత్వ మిషన్ పర్యవేక్షణలో మాదకద్రవ్య నిరోధక మిషన్లో యువత కీలక భాగస్వామి కావాలన్నారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞలు చేయడం ముదావహమని ఏసీపీ అన్నారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అశోక్రెడ్డి మాట్లాడుతూ మాదకద్రవ్యాలు సృజనాత్మకతను, మంచి దృక్పథాలను చంపుతాయన్నారు. కంప్యూటర్ టెక్నాలజీలకు సంబంధించి నైపుణ్యాలను సులభతరం చేయడానికి అవసరమైన పద్ధతులను విద్యార్థి సమాజం అలవాటు చేసుకోవాలన్నారు. నిర్మాణాత్మక దేశాన్ని నిర్మించడానికి మంచి వ్యక్తిగా మారడంపై మీ దృష్టిని కేంద్రీకరించండి అని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో కేయూ పీఎస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్.రవికుమార్, ఎస్సై శ్రీకాంత్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ పి.రమేష్ రెడ్డి, కిట్స్డబ్ల్యు యాంటీ-డ్రగ్ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ కె.శ్రీధర్, ఇతర సభ్యులు డాక్టర్ పి.నాగార్జున రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్, డాక్టర్ సిహెచ్.సతీష్చంద్ర, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ పీఆర్వో డాక్టర్ డి.ప్రభాకరాచారి, 360 మంది విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థి ప్రతినిధులు హాజరయ్యారు.





