- తెలంగాణా సంపద ఒక కుటుంబమే అనుభవిస్తున్నది..
- బిఆర్ఎస్, బిజెపిలు ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి
- వరంగల్ కార్నర్ మీటింగ్లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ
- ప్రజలను ఆత్మీయ పలకరింపుతో ముందుకు సాగిన రాహుల్ పాదయాత్ర
వరంగల్/ఎంజిఎం, ప్రజాతంత్ర, నవంబర్ 17 : సోనియా గాంధీ తెలంగాణా ప్రజల కల నిజం చేయాలని రాష్ట్రం ఇస్తే ఆ సంపద ఒక కుటుంబమే అనుభవిస్తున్నదని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్లో శుక్రవారం పర్యటించారు. వరంగల్ చౌరస్తా నుంచి రుద్రమదేవి సర్కిల్ వరకు పాదయాత్ర చేశారు. పాదయాత్రలో జనాలను పలకరిస్తూ కేసీఆర్ ప్రభుత్వంలో వారు పడే ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. జనాలకు అభివాదం చేస్తూ..వొచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సమస్యలన్నింటిని పరిష్కరిస్తామన్నారు. ఈ పాదయాత్రలో భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
మధ్యలో ఛాయ్ షాపు యజమానితో ముచ్చటించి టీ తాగారు. టీ దుకాణాల వారి సాదక బాధలు అడిగితెలుసుకున్నారు. ఆనంతరం నిర్వహించిన కార్నర్ మీటింగ్లో రాహుల్ మాట్లాడుతూ…కాళేశ్వరం ప్రాజెక్ట్ స్వయంగా చూశానని, గోడలు పగుళ్లు వొచ్చాయన్నారు. 1లక్ష కోటి రూపాయలు అవినీతి జరిగిందన్నారు. ఉద్యోగాలు లేవు…ధరణి పేరుతో భూములు లాక్కున్నారుని, దళిత బంధులో అవినీతి ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు రావని ఆరోపించారు. కాంగ్రెస్ ఏం చేసిందని కేసిఆర్ అంటున్నాడని, ఆయన చదివిన స్కూల్, కాలేజ్, యూనివర్శిటీ కాంగ్రెస్ ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కలిపిస్తామని, ప్రతి నెల 2500 మహిళల అకౌంట్లో వేస్తామని, రైతులకు ఎకరాకు 15 వేలు రైతు భరోసా కింద ఇస్తామని రైతు కూలీలకు 12 వందలు ప్రతి నెల ఇస్తామని, ఉచిత కరెంటు, గృహ జ్యోతి పథకం క్రింద ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్, ఇందిరమ్మ కింద 5లక్షలు, విద్యా భరోసా కింద విద్యార్థులకు 5లక్షలు ఇస్తామని తెలిపారు.
తమ ప్రభుత్వం వొస్తే ప్రతి పైసా పేద వారికే అందిస్తామని, అధికారం లోకి రాగానే కుల గణన చేపడతామని తెలిపారు. ఇది ప్రేమను పంచే దేశమని బీజేపీ, బిఆర్ఎస్లు విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, ఎవరు ఆందోళన చెందవద్దన్నారు. కాంగ్రెస్ పోరాటం బీజేపీ, బిఆర్ఎస్ తోనే అని బీజేపీ ముసుగులో బిఆర్ఎస్ ను గెలిపించే కుట్ర జరుగుతోందన్నారు. ఎంఐఎం కూడ వారితో కలిసిందని తెలంగాణా నుండీ కెసిఆర్ ను పంపడం, ఢిల్లీ లో బీజేపీ ని ఒడించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఆయన హిందీలో ప్రసంగించగా వ్యాఖ్యాత ముగ్దుం తెలుగులో అనువదించారు. ఆయన తో పాటు తూర్పు అభ్యర్థి కొండా సురేఖ, కొండా మురళి, పశ్చిమ అభ్యర్ధి నాయిని రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





