పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24: సంగారెడ్డి జిల్లా కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డుపైన గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న టిప్పర్ ను, కంటైనర్ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మహారాష్ట్రకు చెందిన రెండు టిప్పర్లు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి గచ్చిబౌలి వైపు వెళ్తున్నాయి. ఒక టిప్పర్ లో సాంకేతిక సమస్య రావడంతో రోడ్డు పక్కకు రెండింటిని ఆపి రిపేర్ చేస్తున్నారు. కాగా అకస్మాత్తుగా వెనుక నుండి వేగంగా వచ్చిన కంటైనర్ ఆగిఉన్న టిప్పర్ ను ఢీకొట్టడంతో టిప్పర్ ను రిపేర్ చేస్తున్న మధ్యప్రదేశ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు ములుసింగ్ బధౌరియా(41), ధర్మేందర్ సింగ్(35) అక్కడికక్కడే మృతి చెందారు. కంటైనర్ లోని డ్రైవర్ క్లీనర్ కు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారాన్ని అందుకున్న కొల్లూరు పోలీస్ స్టేషన్ సీఐ సంజయ్ కుమార్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


